
సాక్షి, అనంతపురం: జిల్లాలో కరువు నివారణకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో శ్రమించారని, ఆయన హయాంలో అనంతపురం జిల్లాకు ఎంతో మేలు జరిగిందని వైఎస్ఆర్ సీపీ నేత, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. హంద్రీ-నీవా ప్రాజెక్ట్ పనులను యుద్ధ ప్రాతిపదికన వైఎస్ఆర్ పూర్తి చేయగా, చంద్రబాబు ప్రభుత్వం వైఎస్ఆర్ ఆశయాలకు తూట్లు పొడుస్తుందని ఆయన మండిపడ్డారు. జిల్లాలో 300 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోగా, కేవలం 45 మందికే చంద్రబాబు సర్కార్ పరిహారం ఇవ్వడం దుర్మార్గమన్నారు.
'వైఎస్ఆర్ హయాంలో జిల్లాలో ఎంతో అభివృద్ధి జరిగింది. రైతులు ఎంతో ధీమాగా ఉండేవారు. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితులు జిల్లాలో లేవు. చంద్రబాబు సీఎం అయ్యాక రైతుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు కావస్తున్నా రైతులకు ఎలాంటి ప్రోత్సాహకాలు లేవు. ఎన్నికలకు ముందు రుణమాఫీ అన్నారు. ఆ హామీకి నీళ్లొదిలారు. 4 లక్షల మంది వ్యవసాయ కూలీలు జిల్లా నుంచి వలస వెళ్లినా చంద్రబాబు సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అందుకే వలసలు నేటికీ కొనసాగుతున్నాయి. వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర రైతులకు భరోసా కల్పిస్తోంది. మరోసారి జిల్లా రైతులకు మంచి రోజులు రావాలంటే వైఎస్ జగన్ అధికారంలోకి రావాలని' అనంత వెంకట్రామిరెడ్డి అభిప్రాయపడ్డారు.