2019లో అధికారమే లక్ష్యం: లక్ష్మణ్‌

Amit Shah will attend three conference in Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పార్టీ అధికారంలోకి రావడానికి ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన ఫార్ములాలనే తెలంగాణలోనూ అమలుచేస్తామని భార తీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ తెలిపారు. గురువారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా హైదరాబాద్‌లో మూడు సమావేశాల్లో పాల్గొంటారని చెప్పారు. అమిత్‌ షా పర్యటన అనంతరం రాష్ట్రంలో పార్టీ పనితీరు, విస్తరణ, భవిష్యత్‌ కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకుంటారని చెప్పారు.

2019లో అధికారమే లక్ష్యంగా అమిత్‌ షా నగరానికి వస్తున్నారని లక్ష్మణ్‌ వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమావేశాలు నిర్వహిస్తారని చెప్పారు. రాష్ట్ర కోర్‌ కమిటీ, ముఖ్యనేతలతో ప్రత్యేకంగా సమావేశమవుతారని తెలిపారు. బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేసి అధికారంలోకి తెచ్చేందుకు ఒక రోడ్‌ మ్యాప్‌ తయారు చేస్తారని వివరించారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఇప్పటికే జన చైతన్య యాత్రలో మొదటి విడతను పూర్తిచేశామన్నారు.

గతంలో ఉన్న కాంగ్రెస్, ప్రస్తుతమున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాల వైఫల్యాలు, హామీలు అమలు చేయకుండా చేసిన మోసాలను ఎండగడుతున్నామన్నారు. 2019 ఎన్నికలకు మిషన్‌ 60కి పైగా సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా చెప్పారు. పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రభుత్వ తీరు బట్టబయలైందన్నారు. బీజేపీకి అభ్యర్థులు ఉన్నారో, లేదో తాము చేపట్టిన జన చైతన్య యాత్రను చూస్తే తెలుస్తుందన్నారు. యాత్రకు ప్రజలు అశేషంగా వచ్చారని, టీఆర్‌ఎస్‌ను విమర్శిస్తుంటే జేజేలు పలికారని చెప్పారు.     

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top