ఏ కుటుంబాన్ని టార్గెట్‌ చేయలేదు : అమిత్‌ షా

Amit Shah Replies In Rajya Sabha Over SPG Bill - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఏ ఒక్క కుటుంబాన్ని కేంద్ర ప్రభుత్వం టార్గెట్‌ చేయలేదని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తెలిపారు. రాజ్యసభలో ఎస్పీజీ సవరణ బిల్లుపై జరిగిన చర్చకు అమిత్‌ షా సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్పీజీ అనేది స్టేటస్‌ సింబల్‌ కాదని వ్యాఖ్యానించారు. ప్రజలకు భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. ఎస్పీజీ చట్టానికి సవరణ చేయడం ఇది ఐదవసారి అని అమిత్‌ షా గుర్తుచేశారు. అయితే గాంధీ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని సవరణ చేయలేదని స్పష్టం చేశారు. కానీ గతంలో జరిగిన నాలుగు సవరణలు కూడా గాంధీ కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకునే జరిగాయని విమర్శించారు. ఎస్పీజీ భద్రతను కేవలం గాంధీ కుటుంబానికే కాకుండా.. మాజీ ప్రధానులకు కూడా తొలగించిన విషయాన్ని గమనించాలన్నారు. 

కేవలం గాంధీ కుటుంబాన్ని మాత్రమే కాదు.. దేశంలోని ప్రతి ఒక్కరిని రక్షించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. కాంగ్రెస్‌ నేతలు గాంధీ కుటుంబానికి ఎస్పీజీ కావాలని ఎందుకు పట్టుబడుతున్నారో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. ముప్పు ఆధారంగానే భద్రత తొలగించినట్టు స్పష్టం చేశారు. ఎస్పీజీ భద్రత ప్రధాన మంత్రికి మాత్రమే ఉంటుందని వెల్లడించారు. అమిత్‌ షా ప్రసంగం అనంతరం.. ఎస్పీజీ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. అయితే దీనిని నిరసిస్తూ కాంగ్రెస్‌ సభ నుంచి వాకౌట్‌ చేసింది. కాగా ఎస్పీజీ సవరణ బిల్లు ఇప్పటికే లోక్‌సభ ఆమోదం పొందిన  సంగతి తెలిసిందే. దీంతో ఈ బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం లభించింది. 

ఆ ఘటన యాదృచ్ఛికంగా జరిగింది : షా
కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ ఇంటి వద్ద భద్రత లోపంపై అమిత్‌ షా స్పందించారు. ఎస్పీజీ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఘటన యాదృచ్ఛికంగా జరిగిందన్నారు. దీనిపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్టు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు అధికారులను సస్సెండ్‌ చేసినట్టు వెల్లడించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top