
ప్రకాశం జిల్లా : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే ప్రచారకర్తలని ఆ పార్టీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబు అన్నారు. టీడీపీ దగ్గర బలిసిన కార్యకర్తలున్నారని, నదుల్లో ఇసుక తిన్నవాళ్లు, చెరువుల్లో మట్టి తిన్నవాళ్లు వాళ్ల దగ్గర ఉన్నారని చెప్పారు. టీడీపీ వాళ్లకు ఈనాడు, ఆంధ్రజ్యోతితోపాటు 15 న్యూస్ ఛానళ్లున్నాయని, అందువల్ల ప్రజల్లోకి విస్తృతంగా పార్టీని తీసుకెళ్లాల్సి ఉందని చెప్పారు. ‘వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉంటే రాష్ట్రం చీలేది కాదు. చంద్రబాబు గెలిచేవాడు కాదు. ప్రత్యేక పరిస్థితుల్లో వైఎస్సార్సీపీ ఆవిర్భవించింది. వైఎస్ జగన్ కేసులను ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు పిరికిపందలా స్టేలు తెచ్చుకున్నారు. ఓటమి కూడా మంచిదేనోమో.. ఇవాళ దేశవ్యాప్తంగా ఇంతటి ప్రజాదరణ పొందిన నేత మరెవ్వరూ లేనంతగా వైఎస్ జగన్ ఎదుగుదలకు తోడ్పడింది. చంద్రబాబు ఇచ్చే డబ్బు మనదే. ఆ డబ్బు తీసుకుని మీ ఇష్టం వచ్చిన వాళ్లకు ఓటు వేయాలని ప్రజలకు చెప్పండి’ అని ఆయన కార్యకర్తలకు సూచించారు.
‘చంద్రబాబును బీజేపీ మోసం చేసిందంటాడు. కానీ ఇద్దరు కలిసి రాష్ట్ర ప్రజలను మోసం చేశారు. హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అన్న చంద్రబాబు.. జగన్ దెబ్బకు మళ్లీ హోదా నినాదం ఎత్తుకున్నాడు. చంద్రబాబు దీక్షల్లో అధికారులు, పొదుపు మహిళల్ని చూపి అదే బలమంటూ వాళ్ల పార్టీ నాయకులు వెళ్లిపోకుండా కాపాడుకుంటున్నాడు’ అంబటి రాంబాబు అన్నారు. కార్యకర్తల రుణం తీర్చుకునేందుకు జగన్ ఎల్లవేళలా సిద్ధంగా ఉంటారని ఆయన హామీ ఇచ్చారు.