ఫ్లోరోసిస్ రక్కసికి సమాధానం జలజాలమే | Water reticle to Fluorosis | Sakshi
Sakshi News home page

ఫ్లోరోసిస్ రక్కసికి సమాధానం జలజాలమే

Dec 18 2014 2:39 AM | Updated on Oct 2 2018 7:51 PM

ఫ్లోరోసిస్ రక్కసి మీద మరింత పట్టుదలతో సమరం సాగిస్తే తప్ప, నల్లగొండ ప్రజానీకానికి మనుగడ లేదు.

ఫ్లోరోసిస్ రక్కసి మీద మరింత పట్టుదలతో సమరం సాగిస్తే తప్ప, నల్లగొండ ప్రజానీకానికి మనుగడ లేదు. ప్రపంచంలోనే అత్యధికంగా ఫ్లోరైడ్ ఉన్న నీళ్లను ఈ ప్రాంతవాసులు తాగుతున్నారు. ప్రభుత్వాలు వ స్తున్నాయి. పోతున్నాయి. కానీ ఈ సమస్యను చిత్తశుద్ధితో పరిష్కరిం చడానికి జరిగిన ప్రయత్నం చిన్నదే. ఈ బాధ నుంచి ఎప్పుడు విముక్తు లమవుతామా అని ఈ జిల్లా వాసులు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇప్పు డు మరో ఆశ కనిపిస్తోంది- అదే జలజాలం పథకం.
 
నల్లగొండ జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో 30 ఏళ్లకే ముసలితనం మీద పడుతోంది. దంతాలు గారపట్టి, కాళ్లు, చేతులు వంకరపోతున్నా యి. నడుమ వంగి, తుప్పు పట్టిన యంత్రాల మాదిరిగా కదలని కీళ్లతో ఈ ప్రాంతవాసులు పడే యాతన వర్ణించ శక్యంకానిది. వీరంతా పేద లు. ఇప్పటికీ చాలా గ్రామాలలో పొద్దస్తమానం వ్యవసాయ పనులు చేసుకుని ఇంటికి వస్తే ఏదో ఒక మందు బిళ్ల (గోలీ) వేసుకుంటే తప్ప నిద్రరాదు. లేకపోతే ఒళ్లు నొప్పులతో, సలుపుతో ఆ రాత్రి నరకం చూ డాలి.  ఇక్కడ ప్రజలు తీసుకుంటున్న నీరు, ఆహారంతో కూడా రోజుకు 50 నుంచి 100 మిల్లీగ్రాముల ఫ్లోరైడ్ వారి దేహాలలోకి ప్రవేశిస్తున్నదని యునిసెఫ్ విశ్లేషించిన సంగతి గుర్తుకు తెచ్చుకోవాలి.
 
 ఈ జిల్లాలో ప్రజలు తాగుతున్న నీళ్లలో 4.5 పీపీఎం ఫ్లోరైడ్ ఉంది. వేలమంది దంతాలు గారపట్టడం, కాళ్లు చేతులు వికృతంగా మారిపో వడం దాని ఫలితమే. ఈ నీటికంటే విషమే కాస్త నయమని ప్రజలు భావిస్తుంటారు. నార్కట్‌పల్లి, మర్రిగూడ, మునుగోడు, చండూరు, నాంపల్లి, దేవరకొండ వంటి మండలాలలో ఫ్లోరైడ్ శాతం చాలా ఎక్కు వ. సమస్య ముదురుతోంది. బాధితుల సంఖ్య పెరుగుతోంది. పరిష్కా రం మాత్రం కానరావడం లేదు. మూడు నాలుగు దశాబ్దాలుగా ఈ మహమ్మారి మీద పోరాటం జరుపుతున్నా, ఇప్పటికీ చిన్నారులలో కూ డా ఈ లక్షణాలు పొడసూపడం ఎంత విషాదమో అర్థం చేసుకోవాలి. ఎన్ని ప్రభుత్వాలు మారినా మా తలరాతలు మారడం లేదని అందుకే బాధపడుతున్నాం. చిరకాలం నుంచి ఉన్న చెరువులు, కుంటలు నాశనం కావడం కూడా ఇందుకు కారణం. భూగర్భ జలాలు అడుగంటి ఫ్లోరైడ్ పరిమాణం పెరుగుతోంది.
 
దీనికి పరిష్కారం జిల్లాలోని ఎస్‌ఎల్‌బీసీ, బ్రాహ్మణవెల్లంల, ఉదయసముద్రం వంటి ప్రాజెక్టులకు అధిక మొత్తం లో నిధులను కేటాయించి త్వరితగతిన పూర్తి చేయాలి. అప్పుడే ఇక్కడ ఇంటింటికీ శుద్ధమైన తాగునీరు దొరుకుతుంది. కొత్త ప్రభుత్వం ప్రవేశ పెట్టదలిచిన జలజాలం (వాటర్‌గ్రిడ్) పథకంతో ఫ్లోరోసిస్ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఇక్కడి వారి ఆశ. కాబట్టి దీనిని చిత్తశుద్ధితో అమలు చేయాలి. మా తరువాతి తరాలైనా సుఖంగా ఉంటాయన్న ఆశ ఇది. అందుకే ఈ ఆశ ఈసారి వమ్ముకారాదని కోరుకుంటున్నాం.
 బత్తుల శ్రీరాములు  బ్రాహ్మణవెల్లంల, నల్లగొండ జిల్లా
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement