
పుష్కరాల పనులు
హైవే మీద మద్యం దుకాణాలను అనుమతించడం చాలా అన్యాయం. నడిరోడ్డు మీద మద్యాన్ని అందు బాటులోకి తెచ్చి ఎలాంటి సంకేతాలిస్తున్నారు?
అక్షర తూణీరం
హైవే మీద మద్యం దుకాణాలను అనుమతించడం చాలా అన్యాయం. నడిరోడ్డు మీద మద్యాన్ని అందు బాటులోకి తెచ్చి ఎలాంటి సంకేతాలిస్తున్నారు?
అసలే కృష్ణాతీరం నవ్యాంధ్ర క్యాపిటల్ నిర్మాణ పనుల్లో హడావుడిగా ఉంటే, ఆపైన పుష్కరా లొచ్చిపడ్డాయి. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ నెలాఖరుకి పూర్తి కాకపోతే పుష్కరాలకి మర్యాద దక్కదని మహానేత ఆదేశాలిచ్చారు. వేస్తున్నవి రోడ్లంటే రోడ్లుకాదు. తారుని నీళ్లకంటే పల్చగా చేసి, దాన్ని మంత్రోదకంలా చిలకరించి కొత్త రోడ్లని చాలా వేగంగా సిద్ధం చేస్తున్నారు. తారు నీళ్లు కల్లాపి జల్లుతున్నారని ఒక పల్లెటూరి ఇల్లాలు చమత్కరించింది.
ఈ పుష్కర పనులు అస్మదీయులకు లాభసాటి పండగ. ఈ పుణ్య పర్వం సందర్భంగా - పుష్కరాల రోడ్లు, పుష్కరాల ఘాట్లు, పుష్కరాల గట్లు, పుష్కరాల దీపాలు ఇంకా చిత్ర విచిత్రమైన పనులకు టెండర్లు పడ తాయి. పాత తరం హడా వుడి పనులు అలాగే ఉంటాయి. ఇలాంటి వాటిపై వ్యాఖ్యానించేదేమీ లేదు.
కాబోతున్న విశ్వనగరం మనది. మూడొంతులు అయిపోయిందనే ఏలిన వారి నమ్మకం. గట్టిగా నాలుగు చినుకులు పడితే చాలు అన్నీ వీధి గండాలే. ‘‘హమ్మయ్య! ఇవ్వాల్టికి అందరూ ప్రాణాలతో, కాళ్లూ, చేతులతో ఇంటికి చేరారు. దేవుడా! ధన్యవాదాలు’’ అని ఇల్లాండ్రు ప్రతినిత్యం దణ్ణం పెట్టుకుంటున్నారు. ఇది ఎక్కువచేసి చెప్పింది కాదు. పైగా మాట్లాడితే న్యూయార్క్ నగరంతో వంతు పెట్టడంవల్ల నగరవాసులకి మరింత దుఃఖం పెల్లుబుకుతోంది.
నేను చరిత్ర పుస్తకంలో చదువుకున్న మొదటి నినాదం ‘‘స్వాతంత్య్రం నా జన్మహక్కు!’’. నేను స్వయంగా విన్నది ‘‘గరీబీ హఠావో!’’. ‘‘ఈ దేశం వెలిగిపోతోంది చూడండి’’ అంటూ ఫీల్గుడ్ తత్వాన్ని మంత్రించారు. రెండేళ్ల క్రితం సింహగర్జనలా ‘‘మేకినిండియా’’ వినిపించింది. మొద ట్నించీ గుర్తు చేసుకుంటే ఇది పదహారో జాతీయ నినాదం.
కొత్త నోళ్లలో కొన్ని పాత నినాదాలు పదే పదే వినిపిస్తూ ఉంటాయి. పేదరికాన్ని, అవినీతిని పారదోలతాం. ఈ మధ్య పారదర్శక పాలన సాగిస్తామనే స్లోగన్ వినిపిస్తోంది. అంటే అద్దాల గదుల్లోంచి పాలన సాగించడమా? అమరావతి కోసం భూమి పోగొట్టుకున్న ఓ బక్క రైతు, ‘‘ఈ ప్రజల కోసం ప్రజల చేత... ఇదంతా పెద్ద అబద్ధం స్వామీ’’ అని అరిచాడు. నేను వివరాల్లోకి పోలేదు. ప్రస్తుతం కొత్త క్యాపిటల్లో బాగా చిక్కపడుతున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక కాలుష్యాలపై చర్యకిది సమ యం కాదు. సందర్భమూ కాదు.
హైవే మీద మద్యం దుకాణాలను అనుమతించి, ప్రోత్సహించడం చాలా అన్యాయం. ఇప్పటికే హైవే ప్రమాదాలు భయంకరంగా జరుగు తున్నాయి. నడిరోడ్డు మీద మద్యాన్ని అందుబాటులోకి తెచ్చి ఎలాంటి సంకేతాలిస్తున్నారు? ఏమి సందేశమిస్తున్నారు?
మునుపు బ్రిటీష్ హయాంలో రైల్వే స్టేషన్లలో లిక్కర్ షాపులుండేవి. ఇప్పుడు మనం మాత్రం ఎందుకు కూడదు? హైవేల మీద పెట్రోల్ బంకులలో టై అప్ పెట్టుకుంటే అందరికీ ఉభయతారకంగా ఉంటుంది. అటు ఆ ట్యాంక్ని, ఇటు ఈ ట్యాంక్ని ఒకేచోట నింపుకుని గాలిలో తేలుతూ పోతారు. అప్పుడు హైవే టోల్ గేట్లు కూడా పెంచవచ్చు.
శ్రీరమణ, (వ్యాసకర్త ప్రముఖ కథకుడు)