జెడ్పీటీసీ సభ్యత్వం రద్దు

ZPTC Membership Canceled - Sakshi

ఆదివాసీ కాదని నిర్ధారించిన కలెక్టర్‌

రాయగడ : రాయగడ జిల్లా కాశీపూర్‌ ‘సి’జోన్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన జెడ్పీటీసీ సభ్యుడు నీలకంఠజోడియా సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా మెజిస్ట్రేట్‌ గుహపూనాంతపస్‌కుమార్‌ బుధవారం ఉత్తర్వులు జారీ  చేశారు. వివరాలిలా ఉన్నాయి. రాయగడ జిల్లా పరిషత్‌లో 22స్థానాలు ఉండగా కాంగ్రెస్‌ 11స్థానాలు, బీజేడీ 7స్థానాలు, బీజేపీ 4స్థానాలు, గత మూడంచెల  పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందాయి.  అయితే కాశీపూర్‌ జోన్‌లో ఓడిపోయిన బీజేడీ పార్టీకి చెందిన అభ్యర్థి పాపులర్‌ మజ్జి ఎన్నికల అనంతరం కాశీపూర్‌ ‘సి’ జోన్‌లో గెలుపొందిన కాంగ్రెస్‌ అభ్యర్థి నీలకంఠ జోడియాపై ఫిర్యాదు చేశారు.

నీలకంఠ జోడియా ఆ దివాసీ కాదని ఎన్నికల నామినేషన్‌లో  తప్పుడు కుల ధ్రువీకరణ   పత్రం అందజేశారంటూ జిల్లా మెజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై జిల్లా మెజిస్ట్రేట్‌ ఈ నెల 21న విచారణ చేసి అనంతరం కాశీపూర్‌ ‘సి’జోన్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి నీలకంఠజోడియా సభ్యత్వం చెల్లదని నిర్ధారించారు. నీలకంఠ జోడియా సమర్పించిన ధ్రువీకరణ పత్రాలు నకిలీవని నిర్ధారించి ఆయన జిల్లా పరిషత్‌ సభ్యత్వాన్ని రద్దు చేశారు. దీనిపై కాంగ్రెస్‌ పార్టీ తరఫున హైకోర్టులో రిట్‌ ఫైల్‌ చేస్తానని ఈ సందర్భంగా నీలకంఠజోడియా  మీడియాకు తెలియజేశారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top