మహిళలకు ప్రత్యేక అవకాశం! | Women to get more time for MPhil, PhD | Sakshi
Sakshi News home page

మహిళలకు ప్రత్యేక అవకాశం!

Apr 13 2016 4:52 PM | Updated on Sep 3 2017 9:51 PM

మహిళలకు ప్రత్యేక అవకాశం!

మహిళలకు ప్రత్యేక అవకాశం!

ఎంఫిల్, పీహెచ్డీ చేసేందుకు మహిళలకు, వికలాంగ అభ్యర్థులకు కొంత ప్రత్యేక సమయాన్ని ఇచ్చేందుకు యూజీసీ నిర్ణయించింది.

న్యూఢిల్లీ: మహిళలకు ఎంఫిల్, పీహెచ్ డీ చేసేందుకు  ఎక్కువ సమయం ఇవ్వాలంటూ గతవారం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ చేసిన సిఫార్సులపై యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజిసి) స్పందించింది. మహిళలకు, వికలాంగ అభ్యర్థులకు కొంత అధిక సమయాన్ని ఇచ్చేందుకు అంగీకరించింది.

మహిళలతోపాటు... 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారు ఎంఫిల్ పేపర్లు పూర్తి చేసేందుకు ఓ సంవత్సరం అదనంగానూ, అలాగే  పీహెచ్ డీ థీసిస్ సమర్పించేందుకు రెండేళ్ళు ఎక్కువ సమయం వినియోగించుకునేందుకు యూజీసీ ప్రత్యేక అవకాశం కల్పించింది. అంతేకాక ఈ రెండు డిగ్రీలు పూర్తి చేసే సమయంలో మహిళలందరూ మెటర్నిటీ, ఛైల్డ్ కేర్ సెలవును 240 రోజులపాటు వినియోగించుకునే అవకాశాన్ని కూడా కల్పించింది. అలాగే వికలాంగులు, మహిళలు వారి అధ్యయనం సమయంలో వివాహం లేదా కుటుంబ సంబంధిత కారణాలతో తమ పరిశోధనా డేటాను నిబంధనల ప్రకారం బదిలీ చేసుకొనే అవకాశాన్ని కూడా కల్పించింది.

మరో ముఖ్యమైన నిర్ణయాన్ని కూడా యూజీసీ తీసుకుంది. జూలై 11,  2009 ఎంఫిల్, పీహెచ్ డీ ప్రోగ్రామ్ కోసం నమోదు చేసుకున్న అభ్యర్థులకు డిగ్రీలను అందించే విషయంలోనూ, విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ లేదా తత్సమానమైన పోస్టుల నియామకాల విషయంలోనూ.. ప్రత్యేక అవకాశాలను కల్పించింది.  షరతులకు లోబడి నిర్వహించే జాతీయ అర్హత పరీక్ష (NET)  విషయంలోనూ మినహాయింపును ఇచ్చింది. అలాగే రెగ్యులర్ రీతిలో పీహెచ్ డీ చేసే స్కాలర్ల థీసిస్ ను కనీసం ఇద్దరు ఎక్స్ టర్నల్ ఎగ్జామినర్స్ పరిశీలించి వుండాలి. ఓపెన్ పీహెచ్‌డీ లో అభ్యర్థులు తమ పరిశోధనా పత్రాలను కనీసం రెండు గుర్తింపు పొందిన జర్నల్స్ లో ప్రచురించి ఉండాలని, దీనికితోడు పీహెచ్‌డీ పనికి ఆధారంగా కనీసం రెండు సమావేశాలు, సెమినార్ల లో తమ అధ్యయనాలను సమర్పించి ఉండాలని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement