కశ్మీర్‌: కేంద్రంపై సుప్రీం తీవ్ర ఆగ్రహం

where is your reply on Kashmir detentions, SC to Centre, JK govt - Sakshi

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు బుధవారం కేంద్ర ప్రభుత్వం, జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జమ్మూకశ్మీర్‌లో పెద్ద ఎత్తున నిర్బంధం విధించడం, పౌరహక్కులపై ఆంక్షలు విధించడం తదితర ఆరోపణలకు సంబంధించి సమాధానం ఎందుకు ఇవ్వలేదంటూ సర్వోన్నత న్యాయస్థానం మండిపడింది.

ఆర్టికల్‌ 370 రద్దు అనంతరం కేంద్రం, జమ్మూకశ్మీర్‌ సర్కారు తీరును తప్పుబడుతూ పెద్ద ఎత్తున సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. వీటిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ఆసిఫా ముబీన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై అఫిడవిట్‌ రూపంలో సమాధానం ఎందుకు ఇవ్వలేదంటూ కేంద్రం, కశ్మీర్‌ సర్కార్లను నిలదీసింది. ఎన్నారై అయిన తన భర్తను అదుపులోకి తీసుకున్నారని, ఇది వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమేనని ఆసిఫా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

సుప్రీంకోర్టు ఆగ్రహంతో కశ్మీర్‌ ప్రభుత్వం స్పందిస్తూ.. ఐదు నిమిషాల్లో అఫిడవిట్‌ దాఖలు చేస్తామని పేర్కొంది. ఎంతోమంది పిటిషన్లు వేశారని, అందువల్లే అఫిడవిట్‌ దాఖలు చేయడంలో జాప్యమైందని సొలిసిటర్‌ జనరల్‌ పేర్కొన్నారు. కశ్మీర్‌లో నిర్బంధంపై అఫిడవిట్లు దాఖలు చేయకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టిన సుప్రీంకోర్టు.. తమ ఆదేశాల పట్ల ఉదాసీనంగా వ్యవహరించరాదంటూ కేంద్రం, కశ్మీర్‌ సర్కార్‌లను మందలించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top