గుజరాత్లోని గిర్ సోమనాథ్ జిల్లాలో ఉన్న ఉనాలో జులై 11న కొందరు దళితులు చనిపోయిన ఒక ఆవు చర్మాన్ని వలుస్తుండగా..
గుజరాత్లోని గిర్ సోమనాథ్ జిల్లాలో ఉన్న ఉనాలో జులై 11న కొందరు దళితులు చనిపోయిన ఒక ఆవు చర్మాన్ని వలుస్తుండగా.. గమనించిన గో పరిరక్షణ సమితి సభ్యులు వారిపై దాడికి పాల్పడ్డారు. ఆవులను చంపి మరీ చర్మాన్ని వలుస్తున్నారంటూ వారిని బంధించారు. చనిపోయిన ఆవు చర్మాన్నే తీస్తున్నామన్నా వినిపించుకోకుండా వారి చేతులను కట్టేసి తీవ్రంగా కొట్టారు. ఆ తరువాత బాధితుల్లో ఏడుగురు ఆత్మాహత్యాయత్నం చేశారు.
ఈ ఘటనపై దళితులు తీవ్రంగా స్పందిం చారు. నాటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా వరుస నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఆందోళనకారుల రాళ్లదాడిలో మంగళవారం ఒక హెడ్ కానిస్టేబుల్ మరణించారు. దళిత సంఘాలు బుధవారం రాష్ట్రవ్యాప్త బంద్ నిర్వహించాయి. కొన్ని స్వల్ప హింసాత్మక ఘటనలు మినహా బంద్ ప్రశాంతంగా ముగిసింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పార్లమెంట్లోనూ బుధవారం విపక్షాలు దీన్ని ప్రధానంగా లేవనెత్తాయి. కాగా, బాధిత కుటుంబాలను గుజరాత్ సీఎం ఆనంది బెన్ బుధవారం పరామర్శించారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గురువారం, ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ శుక్రవారం ఉనాను సందర్శించనున్నారు.