
హిందీపై తమిళనాడు బాటలో బెంగాల్
కోల్కతా : ఎనిమిదవ తరగతి వరకూ హిందీని తప్పనిసరిగా బోధించాలన్న జాతీయ విద్యా విధాన ముసాయిదాను వ్యతిరేకించే రాష్ట్రాల్లో తాజాగా పశ్చిమ బెంగాల్ చేరింది. హిందీ బోధనపై తమిళనాడు భగ్గుమంటుంటే బెంగాల్లోనూ ఈ ప్రతిపాదనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. తమపై ఏ భాషను బలవంతంగా రుద్దాలని చూసినా ప్రతిఘటన తప్పదని బెంగాలీ విద్యావేత్తలు, రచయితలు హెచ్చరించారు. హిందీని అనివార్యంగా నేర్చుకోవాలన్న నిబంధనను రవీంద్ర భారతి యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రతిభా సర్కార్ పేర్కొన్నారు.
హిందీని ఒకటవ తరగతి నుంచే నేర్చుకోవాలన్న నిబంధన సరైంది కాదని, ఇది చిన్నారులపై ఒత్తిడి పెంచుతుందని అభిప్రాయపడ్డారు. ఏ భాష నేర్చుకోవాలన్నది విద్యార్ధులు స్వచ్ఛందంగా తీసుకోవాల్సిన నిర్ణయమని ప్రముఖ బెంగాలీ రచయిత శీర్షేందు ముఖోపాధ్యాయ్ అన్నారు. మరోవైపు హిందీని తమపై రుద్దాలని కేంద్రం ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని డీఎంకే చీఫ్ స్టాలిన్ హెచ్చరించారు. కేంద్రం తీరు భాషా యుద్ధానికి దారితీస్తుందని తమళ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా విద్యావేత్తలు, భాషాకారుల నిరసనలతో దిగివచ్చిన కేంద్రం ఏ భాషను ఎవరిపై రుద్దే ఉద్దేశం తమకు లేదని కేంద్రం స్పష్టం చేసింది.