సముద్ర గర్భంలో రైలు ప్రయాణం
యూఏఈ నుంచి ముంబై వరకు అండర్ వాటర్ రైలుకు సన్నాహాలు
యూఏఈ: సముద్ర గర్భంలో రైలు ప్రయాణం చేస్తే ఎలా ఉంటుంది? వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ! కానీ కొన్ని రోజుల్లో ఇది నిజం కాబోతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) నుంచి భారత్ వరకు అండర్వాటర్ హైస్పీడ్ రైలు మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. యూఏఈలోని ఫుజురాయ్ నగరం నుంచి ముంబై వరకు నీటి అడుగున రైలు మార్గాన్ని నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు యూఏఈకి చెందిన నేషనల్ అడ్వైజర్ బ్యూరో కంపెనీ తెలిపింది.
ఈ విషయాన్ని సదరు కంపెనీ ఎండీ అబ్దుల్లా అల్షేహి వెల్లడించారు. ఈ విషయమై అబ్దుల్లా మాట్లాడుతూ.. ‘భారత్లోని ముంబై నుంచి ఫుజురాయ్ నగరాన్ని కలుపుతూ నీటి అడుగున హైస్పీడ్ రైలును తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగుపడేందుకు ఈ ప్రాజెక్టు దోహదం చేయనుంది. భారత్ నుంచి ఎగుమతులు, దిగుమతులు చేసుకునేందుకు ఇది చక్కగా ఉపయోగపడుతుంద’న్నారు.