
నీళ్లు తాగడానికివ్వండి.. మద్యం కంపెనీలకు కాదు
తాగడానికి మంచినీళ్లు లేక జనం అల్లాడుతుంటే, మద్యం కపెనీలకు నీటిసరఫరాచేస్తున్నారంటూ అధికార బీజేపీపై ఫైర్ అయ్యారు శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే.
ముంబై: మహారాష్ట్రలో నెలకొన్న మంచినీటి సంక్షోభం తీవ్రత మిత్రపక్షాల మధ్య మాటలయుద్ధానికి దారితీసింది. తాగడానికి మంచినీళ్లు లేక జనం అల్లాడుతుంటే, మద్యం కపెనీలకు నీటిసరఫరాచేస్తున్నారంటూ అధికార బీజేపీపై ఫైర్ అయ్యారు శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే. కరువు పరిస్థితుల దృష్ట్యా మద్యం కంపెనీలకు నీటి సరఫరాను వెంటనే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. థాక్రే వ్యాఖ్యలకు స్పందించిన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్.. మద్యం షాపులకు నీటి సరఫరాను తగ్గించడం మంచి ఆలోచనగా స్వాగతించారు.
మద్యం కంపెనీలకు తాగునీటిని కేటాయిస్తే నిలిపివేయాల్సిందే కానీ మిగతా పరిశ్రమలకు నీటి సరఫరాను నిలపివేయాలనడం మాత్రం సరైంది కాదని ఫడ్నవిస్ అన్నారు. మద్యం కంపెనీలకు ఎంత నీటిని కేటాయిస్తున్నారో పరిశీలించి, దానిని తగ్గించుకునే మార్గాలు పరిశీలించాలని ఆమేరకు నివేదిక తయారుచేయాల్సిందిగా ఔరంగాబాద్ డివిజనల్ కమిషనర్ ఆదేశించినట్లు నీటిపారుదల మంత్రి గిరీష్ మహాజన్ చెప్పారు. మరఠ్వాడా ప్రాంతంలో తీవ్ర దుర్భిక్షం నెలకొన్న నేపథ్యంలో పక్క రాష్ట్రాలనుంచి రైళ్ల ద్వారా మంచినీళ్లు సరఫరాచేస్తున్న సంగతి తెలిసిందే.