దామాషా ప్రకారం రిజర్వేషన్లు | TRS MP Banda Prakash Comments Over EBC Reservations | Sakshi
Sakshi News home page

దామాషా ప్రకారం రిజర్వేషన్లు

Jan 10 2019 4:14 AM | Updated on Jan 10 2019 4:14 AM

TRS MP Banda Prakash Comments Over EBC Reservations - Sakshi

టీఆర్‌ఎస్‌ ఎంపీ బండ ప్రకాశ్‌

సాక్షి, న్యూఢిల్లీ: బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేసే అధికారాన్ని రాష్ట్రాలకు ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ ఎంపీ బండ ప్రకాశ్‌ ముదిరాజ్‌ కేంద్రాన్ని కోరారు. అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లు కల్పించనున్న రాజ్యాంగ సవరణ బిల్లుపై రాజ్యసభలో బుధవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చేయూత ఇచ్చేందుకు ఉద్దేశించిన బిల్లు ఇదని తెలిపారు. గతంలో వెనుకబాటుతనం అనేది సామాజిక అంశాల్లో విన్నామని తొలిసారి ఆర్థికపరమైన వెనుకబాటుతనం అంశాన్ని వింటున్నామని చెప్పారు.

70 ఏళ్ల స్వతంత్ర దేశంలో కూడా ఆర్థికంగా వెనుకబాటుతనం ఉందని ఈ బిల్లు తెచ్చామంటే అన్నేళ్ల పాటు ఈ దేశాన్ని పాలించిన పాలకుల వైఫల్యమేనన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇదే ప్రాతిపదికగా ముస్లింలకు 12% రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీ తీర్మానించి కేంద్రానికి పంపి తే కేంద్రం సానుకూలంగా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటయ్యాక ముస్లింల జనాభా 12 శాతంగా, ఎస్టీల జనాభా 10 శాతంగా ఉందని, జనాభా దామాషా ప్రకారం వారికి రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించి పార్లమెంటును స్తంభింపజేసినా కేంద్రం స్పందించలేదన్నారు.
 
స్థానిక సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు 
తెలంగాణలో స్థానిక సంస్థల్లో 50% మహిళలకు రిజర్వేషన్లు కల్పించామని ముదిరాజ్‌ తెలిపారు. ఈబీసీ రిజర్వేషన్ల అమలులో సామాజిక రిజర్వేషన్లకు అన్యాయం జరగకుండా జాగ్రత్త పడాలని కోరారు.  

Advertisement
 
Advertisement
Advertisement