ట్రిపుల్‌ తలాక్‌ ఇక రద్దు

Triple Talaq Bill Passed In Parliament - Sakshi

రాజ్యసభలోనూ గట్టెక్కిన బిల్లు

సభ నుంచి వాకౌట్‌ చేసిన జేడీయూ, అన్నా డీఎంకే

బిల్లుకు బీజేడీ మద్దతు

వ్యతిరేకంగా ఓటేసిన వైఎస్సార్‌సీపీ

ముస్లిం దేశాలే మారాయి, మనం మార్చకూడదా?: రవిశంకర్‌ ప్రసాద్‌

ఇండియా సంతోషిస్తోంది: ప్రధాని మోదీ 

న్యూఢిల్లీ : ముస్లిం పురుషులు తక్షణం మూడుసార్లు తలాక్‌ చెప్పి తమ భార్యలకు విడాకులు ఇవ్వడాన్ని (ట్రిపుల్‌ తలాక్‌ లేదా తలాక్‌–ఏ–బిద్దత్‌ను) నేరంగా పరిగణించేలా కేంద్రం తీసుకొచ్చిన బిల్లును రాజ్యసభ మంగళవారం ఆమోదించింది. ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును లోక్‌సభ గతవారమే ఆమోదించడంతో ఈ బిల్లు పార్లమెంటులో పాస్‌ అయ్యింది. తలాక్‌–ఏ–బిద్దత్‌ను ఎస్‌ఎంఎస్, వాట్సాప్, రాతపూర్వకంగా, నోటి మాటతో లేదా ఇతర ఏ మార్గం/పద్ధతిలోనైనా.. ఎలా చెప్పినా ఆ చర్యను ఈ బిల్లు నేరంగా పరిగణిస్తుంది. ‘ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ)’ పేరిట తెచ్చిన ఈ బిల్లును ఎన్డీయేలో భాగమైన జేడీయూ, అన్నా డీఎంకే పార్టీలు కూడా వ్యతిరేకించినప్పటికీ, తటస్థ పార్టీ అయిన బీజేడీ బిల్లుకు మద్దతు తెలిపింది.

బిల్లును ఆమోదించడంపై ఓటింగ్‌ నిర్వహించగా 99 ఓట్లు అనుకూలంగా, 84 ఓట్లు వ్యతిరేకంగా పడ్డాయి. దీంతో రాజ్యసభలోనూ ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు గట్టెక్కింది. ఇక రాష్ట్రపతి సంతకం చేసిన అనంతరం ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు చట్టరూపం దాల్చి, కేంద్రం గతంలో ఇచ్చిన ఆర్డినెన్స్‌ రద్దవుతుంది. బిల్లును ఆమోదించడంపై ఓటింగ్‌కు ముందు.. అసలు ఈ బిల్లును రాజ్యసభ ఎంపిక కమిటీకి పంపాలా? వద్దా? అన్న దానిపైనా ప్రతిపక్షాల బలవంతంతో ఓటింగ్‌ నిర్వహించారు. ఎంపిక కమిటీకి పంపవద్దని 100 ఓట్లు, పంపాలని 84 ఓట్లు పడ్డాయి. ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని గత ప్రభుత్వమే తీసుకొచ్చి, లోక్‌సభలో ఆమోదింపజేసుకున్నప్పటికీ, రాజ్యసభలో అది తిరస్కరణకు గురైంది. దీంతో రెండోసారి మోదీ ప్రభుత్వం ఏర్పడ్డాకా ఈ బిల్లును మరోసారి తీసుకురాగా, పార్లమెంటు ఆమోదం లభించింది.

20 ఇస్లాం దేశాలు కూడా నియంత్రించాయి 
బిల్లుపై నాలుగున్నర గంటలు సాగిన చర్చలో న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ మాట్లాడుతూ తక్షణ ముమ్మారు తలాక్‌ను 20 ఇస్లాం దేశాలే నియంత్రించాయనీ, ముస్లిం మహిళల మంచి కోసం ప్రజాస్వామ్య దేశమైన మనం ఎందుకు ఆ పని చేయకూడదని ప్రశ్నించారు. హిందువుల్లోనూ బహుభార్యత్వం, వరకట్నం తదితర నేరాలకు జైలుశిక్ష ఉందని గుర్తుచేసిన రవిశంకర్‌.. ట్రిపుల్‌ తలాక్‌ చెప్పే వారికి జైలు శిక్ష విధించడాన్ని సమర్థించారు. ముస్లిం ఇళ్లలో గొడవలు పెట్టడానికి రాజకీయ దురుద్దేశంతో ఈ బిల్లును తెచ్చారని రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్‌ ఆరోపించడంపై రవిశంకర్‌ సమాధానమిస్తూ, ముస్లిం మహిళల హక్కులను పట్టించుకోనందునే ఆ పార్టీకి 1984 తర్వాత ఇంకెప్పుడూ ఎన్నికల్లో సాధారణ మెజారిటీ కూడా రాలేదని విమర్శించారు.  ట్రిపుల్‌ తలాక్‌ రాజ్యాంగబద్ధం కాదని 2017లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినందునే తాము ఇప్పుడు ఈ బిల్లు తీసుకురాలేదనీ, వాట్సాప్‌లో కూడా విడాకులిచ్చే భర్తల నుంచి ముస్లిం మహిళల హక్కులకు రక్షణ కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఈ బిల్లును తెచ్చిందని రవిశంకర్‌ చెప్పారు. ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును రాజకీయ కోణంలో కాకుండా, మానవత్వం, లింగ సమానత్వం, మహిళా సాధికారత కోణంలో చూడాలని కోరారు.

టీడీపీ, టీఆర్‌ఎస్‌ ఓటింగ్‌కు గైర్హాజరు 
బీజేపీ మిత్రపక్షమైన అన్నాడీఎంకేతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన టీఆర్‌ఎస్, తెలుగుదేశం పార్టీలు ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి. బీజేపీ నేత అరుణ్‌ జైట్లీ సైతం ఓటింగ్‌కు రాలేకపోయారు. ఇక ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌తో సహా కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు, ఎన్‌సీపీ ఎంపీలు శరద్‌పవార్, ప్రఫుల్‌ పటేల్, ఐదుగురు ఎస్పీ నేతలతో సహా మొత్తం 20 మంది ప్రతిపక్ష ఎంపీలూ ఓటింగ్‌కు గైర్హాజరయ్యారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏకు చెందిన 11 మంది సభ్యుల అన్నాడీఎంకే, ఆరుగురు సభ్యుల జనతాదళ్, ఆర్జేడీకి చెందిన జెఠ్మలానీ ఓటింగ్‌లో పాల్గొనలేదు. దీంతో మొత్తం 57 మంది సభ్యులు ఓటింగ్‌కు దూరమైనట్లయింది. ఫలితంగా సభ్యుల సంఖ్య 183కు చేరి బిల్లు ఆమోదానికి కావాల్సిన ఓట్ల సంఖ్య 92కు పరిమితమయింది.

బిల్లులో ఏముంది? 
తలాక్‌–ఏ–బిద్దత్‌(తక్షణం మూడుసార్లు తలాక్‌ చెప్పడం)ను ఎస్‌ఎంఎస్, వాట్సాప్, రాతపూర్వకంగా, నోటి మాటతో లేదా ఇతర ఏ మార్గం/పద్ధతిలో చెప్పినా ఆ చర్య నేరమని ఈ బిల్లు చెబుతోంది. తక్షణం మూడుసార్లు తలాక్‌ చెప్పి భార్యలకు విడాకులిచ్చే ముస్లిం పురుషులకు మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించేలా  నిబంధనలున్నాయి. ఎవరైనా ముస్లిం పురుషుడు తలాక్‌–ఏ–బిద్దత్‌ పద్ధతిలో భార్యకు విడాకులిచ్చాడని ఫిర్యాదు వస్తే, వారంట్‌ లేకుండానే అతణ్ని అరెస్టు చేసే అధికారం పోలీసులకు ఈ బిల్లు కల్పిస్తోంది. అయితే బాధిత మహిళ లేదా ఆమె రక్త సంబంధీకులు లేదా అత్తింటివారు ఫిర్యాదు చేస్తే మాత్రమే పోలీసులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. బాధిత మహిళ వాంగ్మూలాన్ని కూడా పరిశీలించిన తర్వాతనే జడ్జీలు అవసరం అనుకుంటే నిందితుడికి బెయిలు మంజూరు చేయవచ్చు. విడాకుల అనంతరం తాను, తన పిల్లలు బతకడానికి అవసరమైన భరణం ఇవ్వాలని భర్తను అడిగేందుకు మహిళలకు హక్కు ఉంటుంది.  

చారిత్రక తప్పిదాన్ని సరిచేశాం: మోదీ 
ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును ఆమోదింపజేసుకోవడం ద్వారా పురాతన, మధ్యయుగ కాలం నాటి నుంచి ముస్లిం మహిళలకు జరుగుతున్న చారిత్రక తప్పిదాన్ని తాము సరిచేశామని ప్రధాని మోదీ అన్నారు. ఇకపై ట్రిపుల్‌ తలాక్‌ చెత్తబుట్టకు పరిమితమవుతుందన్నారు. బిల్లు ఆమోదం పొందిన అనంతరం మోదీ ఓ ట్వీట్‌ చేస్తూ ‘ఈ రోజు ఇండియా సంతోషిస్తోంది. సమాజంలో లింగ సమానత్వం సాధనలో ఇదో విజయం. బిల్లుకు మద్దతు తెలిపిన ఎంపీలందరికీ ధన్యవాదాలు. బిల్లుకు అనుకూలంగా ఓటేసిన పార్టీల చర్య భారత చరిత్రలో నిలిచిపోతుంది. పురాతన, మధ్యయుగం నాటి విధానమొకటి ఎట్టకేలకు చెత్తబుట్టలోకి చేరింది. ముస్లిం మహిళలు సాధికారత సాధించడంలో, సమాజంలో వారికి సముచిత గౌరవాన్ని సంపాదించుకోవడంలో ఈ చట్టం సహాయపడుతుంది’ అని వివరించారు. 

ముస్లింలపై దాడుల్లో ఓ భాగం: ఒవైసీ 
ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుకు రాజ్యసభ మంగళవారం ఆమోదం తెలపడంపై ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ స్పందించారు. 2014 నుంచి దేశంలో ముస్లింల పౌరసత్వం, గుర్తింపుపై జరుగుతున్న దాడుల్లో ఈ బిల్లు ఆమోదం ఒక భాగం మాత్రమేనని ఆయన విమర్శించారు. మూకదాడులు, పోలీసుల దురాగతాలు, సామూహిక ఖైదు తమను నిస్సహాయులను చేయలేవని పేర్కొన్నారు. రాజ్యాంగంపై ఉన్న బలమైన నమ్మకంతో అణచివేతకు, అన్యాయానికి, హక్కుల తిరస్కరణకు వ్యతిరేకంగా పోరాడతామని ఆయన ట్విట్టర్‌లో వెల్లడించారు. భారత రాజ్యాంగ బహుళత్వం, వైవిధ్యతను కాపాడేందుకు ఈ చట్టం రాజ్యాంగబద్ధతను సవాల్‌ చేస్తామని ఆయన తెలిపారు. ఈ చట్టం ముస్లిం మహిళలకు వ్యతిరేకమనీ, వారిని మరింత దీనావస్థలోకి నెడుతుందని ఒవైసీ అన్నారు.  

వ్యతిరేకంగా ఓటేసిన వైఎస్సార్‌సీపీ
బీజేపీకి 114 మంది సభ్యుల బలం ఉన్నా 11 మంది సభ్యులున్న అన్నాడీఎంకే, ఆరుగురు సభ్యుల జనతాదళ్‌ వ్యతిరేకిస్తూ బయటకు వెళ్లిపోవటం, మరికొందరు హాజరుకాకపోవటంతో సభ్యుల సంఖ్య 92కు తగ్గింది. ఇద్దరు సభ్యులున్న వైఎస్సార్‌సీపీ తొలి నుంచీ కనబరుస్తున్న వైఖరికి తగ్గట్టుగానే ఈ బిల్లును వ్యతిరేకించింది. సభలో ఉన్న పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారు. తటస్థ వైఖరితో ఉన్న ఏడుగురు సభ్యుల బిజూ జనతాదళ్‌ ఆఖరి క్షణంలో ఈ బిల్లుకు మద్దతిచ్చింది. దీంతో మద్దతిచ్చిన సభ్యుల సంఖ్య 99కి చేరింది. దీంతో బిల్లుకు అనుకూలంగా 99 – వ్యతిరేకంగా 84 ఓట్లు వచ్చాయి. బిల్లు గట్టెక్కింది.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top