
చైన్ స్నాచర్లకు చెక్
చైన్ స్నాచర్ల పనిపట్టేందుకు నగర ట్రాఫిక్ పోలీసులు బుధవారం ప్రత్యేక డ్రైవ్ను ప్రారంభించారు.
స్పెషల్ డ్రైవ్ను ప్రారంభించిన ట్రాఫిక్ పోలీసులు
సాక్షి, ముంబై: చైన్ స్నాచర్ల పనిపట్టేందుకు నగర ట్రాఫిక్ పోలీసులు బుధవారం ప్రత్యేక డ్రైవ్ను ప్రారంభించారు. ద్విచక్రవాహనాలపై సంచరిస్తూ రోడ్డు భద్రతా నియమాలను ఉల్లంఘించి, వీధి నేరాలకు పాల్పడుతున్న వారి భరతం పట్టేందుకు 25 ట్రాఫిక్ పోలీసుల బృందాలు రంగంలోకి దిగినట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. అంతేకాక చైన్ స్నాచింగ్కు పాల్పడి పారిపోతున్న ద్విచక్రవాహనదారులను పట్టుకునేందుకు ట్రాఫిక్ విభాగం నగర పోలీసుల సహాయాన్ని కూడా తీసుకోనున్నారు.
కాగా మధ్యాహ్నం ఒంటి గంట వరకు 3,511 ద్విచక్రవాహనదారులను తనిఖీ చేయగా.. మోటారు వాహనాల చట్టంలోని నిబంధనలు పాటించని 1,300 మంది ద్విచక్రవాహన దారులపై ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. నగరవ్యాప్తంగా తరచూ ద్విచక్రవాహనాలపై సంచరిస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న 100 ప్రదేశాలను పోలీసులు గుర్తించారు. ఒక్కో డివిజన్లో మూడు బృందాలను మోహరించారు. ఒక్కో బృందంలో పోలీసు ఉన్నతాధికారితోపాటు నలుగురు కానిస్టేబుళ్లు ఉన్నారు. అంతేకాకుండా వీరు ప్రతి ద్విచక్రవాహనాన్ని తనిఖీ చేస్తూ అవసరమున్న పత్రాలను కూడా చూపించాల్సిందిగా కోరుతున్నారు. ఈ ప్రత్యేక డ్రైవ్ను ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కొనసాగిస్తున్నారు.
మరి కొన్ని రోజుల వరకు ఈ డ్రైవ్ను కొనసాగించనున్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఇదిలావుండగా చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్న చాలా మంది దొంగిలించిన బైక్లను ఉపయోగిస్తున్నారని అదనపు కమిషనర్(ట్రాఫిక్) క్వైజర్ ఖలీద్ తెలిపారు. అయితే వాహన నియమాలను ఉల్లంఘిస్తున్న, చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్న వారినే కాకుండా వీధి నేరాలకు పాల్పడుతున్న వారిని కూడా పట్టుకోవడం కోసం ఈ ప్రత్యేక డ్రైవ్ను ప్రారంభించామని ఆయన తెలిపారు.