చోరీ సొమ్ముతో.. మలేసియాలో హోటల్‌!

Thief arrested who also an director of a hotel in Malaysia - Sakshi

చెన్నై: దక్షిణాది రాష్ట్రాలకు చెన్నై నుంచి వెళ్లే రైళ్లలో తన చేతివాటం చూపించిన ఓ గజదొంగను పోలీసులు అరెస్టు చేశారు. చోరీ చేసిన నగదుతో దుండగుడు మలేషియాలో హోటల్‌ కొనుగోలు చేసినట్టు వెల్లడైంది. తమిళనాడులో ప్రయాణిస్తున్న రైళ్లల్లో రాత్రి సమయాల్లో నగలు, నగదు చోరీ సంఘటనలు తరచూ జరుగుతున్నాయి. ముఖ్యంగా చెన్నై నుంచి సేలం వెళ్లే రైళ్లలో ఒక ముఠా వరుసగా తమ చేతి వాటాన్ని ప్రదర్శించింది. డీలక్స్‌ బోగీల్లో ప్రయాణిస్తూ అర్ధరాత్రి సమయంలో ప్రయాణికుల లగేజీలను తీసుకుని పారిపోతున్నారు. దీనిపై బాధితుల నుంచి రైల్వే పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో దుండగులను పట్టుకోవడానికి రైల్వే డీజీపీ శైలేంద్రబాబు చర్యలు చేపట్టారు. 

ఈ క్రమంలో డీఐజీ బాలకృష్ణన్‌ నేతృత్వంలో ప్రత్యేక బృందం ఏర్పడింది. పోలీసులు మఫ్టీలో వెళ్లి నిఘా చేపట్టారు. గురువారం రాత్రి చెన్నై నుంచి వెళుతున్న ఓ రైలులో ప్రయాణికుడి వద్ద ఉన్న సంచిని తీసుకుని అర్ధరాత్రి సమయంలో పారిపోతున్న గుర్తు తెలియని వ్యక్తిని మఫ్టీలో ఉన్న పోలీసులు చుట్టుముట్టి పట్టుకున్నారు. పట్టుబడిన వ్యక్తి కేరళకు చెందిన సాహుల్‌హమీద్‌గా తెలిసింది. సాహుల్‌హమీద్‌ మలేషియాలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అక్కడి నుంచి విమానం ద్వారా చెన్నైకి వచ్చి రైళ్లలో రాత్రి సమయాల్లో తన చేతి వాటం ప్రదర్శిస్తున్నట్టు తెలిసింది. ఏసీ, ఫస్ట్‌క్లాస్, స్లీపర్‌క్లాస్‌ బోగీలలో ప్రయాణికులు నిద్రిస్తుండగా మహిళలను లక్ష్యంగా చేసుకుని నగలు చోరీ చేస్తున్నట్టుగా తెలిసింది.  2016లో చోరీలు చేయగా వచ్చిన రూ.కోటి నగదుతో మలేషియాలో హోటల్‌ కొన్నట్టు వెలుగుచూసింది. దుండగుడు సాహుల్‌హమీద్‌కు ఆరు భాషలు మాట్లాడగలడు. అతనికి ఇద్దరు భార్యలున్నారు. మహిళపై అత్యాచారం చేసిన కేసులో అరెస్టయినట్టు తెలిసింది. సాహుల్‌హమీద్‌ 30 మంది ప్రయాణికుల నుంచి సుమారు 110 సవర్ల నగలు చోరీ చేసినట్టు పోలీసులు వెల్లడించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top