మూగజీవాలపై ద్వేషమేల?
విషం కలిపిన ఆహారం తిని వీధి కుక్కలు మృతి
కర్ణాటక,బనశంకరి: మూగజీవాలకు విషమిచ్చి చంపాడో కిరాతకుడు. విషం పెట్టిన ఘటనలో ఏడు వీధికుక్కలు మృత్యవాత పడగా, నాలుగు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన జేపీ.నగర పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. జేపీ.నగర ఎంఎస్.రామయ్యసిటీలో ఎవరో దుండగులు విషం కలిపిన ఆహారాన్ని కుక్కలకు వేశారు. వాటిని తిని ప్రాణాలు పోగొట్టుకున్నాయి. కొనప్రాణంతో ఉన్న కుక్కలను స్థానికులు, ప్రాణిప్రియులు గమనించి ప్రాణి చికిత్సా కేంద్రానికి తరలించారు.
కారకులెవరో తెలిస్తే కేసు పెడతాం
ఈ ఘటన పై బీబీఎంపీ ప్రత్యేక కమిషనర్ రందీప్ మాట్లాడుతూ. వీధికుక్కలకు విషంతో కూడిన ఆహారం వేసిన ఘటన తమ దృష్టికిరాలేదని, పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలా చేయడం నేరమని, కారకుల ఆచూకీ తెలిస్తే పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని చెప్పారు.