శబరిమలలో మహిళల ప్రవేశంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని నిరోదించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని సుప్రీం కోర్టు బుధవారం స్పష్టం చేసింది. ఆలయంలోకి పది నుంచి 50 సంవత్సరాల మహిళల ప్రవేశంపై నిషేధానికి సంబంధించిన అంశంపై విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్ధానం ప్రధాన న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఏ ప్రాతిపదికన మహిళలకు ప్రవేశాన్ని మీరు (ఆలయ అధికారులు) నిరాకరిస్తారు..? ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం..ప్రజల కోసం ఆలయాన్ని తెరిచారంటే ఎవరైనా అందులోకి వెళ్లవచ్చ’ని పేర్కొన్నారు. కేరళలోని శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, ఏఎం కన్విల్కార్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందూ మల్హోత్రాలతో కూడిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారిస్తోంది.
శబరిమల ఆలయంలో మహిళలను ప్రార్ధనలు చేసుకునేందుకు అనుమతించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ వైఖరి అని కేరళ మంత్రి కే సురేంద్రన్ పేర్కొన్నారు. తమ వైఖరిని స్పష్టం చేస్తూ సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశామని చెప్పారు.
ఇక సుప్రీం కోర్టు ఎలాంటి తీర్పు వెలువరించినా దాన్ని అంగీకరిస్తామన్నారు. గత ఏడాది అక్టోబర్ 13న ఈ పిటిషన్పై విచారణను సర్వోన్నత న్యాయస్ధానం రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించింది.