సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాల వెల్లడి | Results revealed Civils | Sakshi
Sakshi News home page

సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాల వెల్లడి

Oct 15 2014 2:29 AM | Updated on Sep 22 2018 7:37 PM

సివిల్ సర్వీసెస్-2014 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) మంగళవారం విడుదల చేసింది.

16,933 మందికి మెయిన్స్ అర్హత
డిసెంబర్ 14 నుంచి మెయిన్స్

 
న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్-2014 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) మంగళవారం విడుదల చేసింది. ఈ ఆగస్ట్ 24న జరిగిన ప్రిలిమినరీ పరీక్షకు 4,52,334 మంది హాజరు కాగా, వారిలో 16,933 మంది మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారని పేర్కొంది. ఈ సంవత్సరం ప్రిలిమ్స్ ఫలితాలను కేవలం 50 రోజుల వ్యవధిలో విడుదల చేసి రికార్డు సృష్టించామని, దీంతో అర్హత పొందిన అభ్యర్థులకు మెయిన్స్ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు మరింత సమయం లభిస్తుందని యూపీఎస్సీ కార్యదర్శి ఆశిమ్ ఖురానా తెలిపారు. ఈ ఏడాది ప్రిలిమ్స్ పరీక్షకు హాజరైన వారి సంఖ్య(4,52,334) కూడా గత సంవత్సరం హాజరైన వారి సంఖ్య(3,24,279)తో పోలిస్తే 40% పెరిగిందన్నారు. ఈ సంవత్సరం సివిల్స్ మెయిన్స్ పరీక్షలు డిసెంబర్ 14 నుంచి డిసెంబర్ 20వ తేదీ వరకు జరగనున్నాయి. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ మెయిన్స్‌కు  1,106 మంది అభ్యర్థులు అర్హత సాధించారని, వారిని కూడా ఈ ప్రిలిమ్స్ పరీక్ష ద్వారానే ఎంపిక చేశామని ఖురానా తెలిపారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలు నవంబర్ 22 నుంచి జరుగుతాయని యూపీఎస్సీ తెలిపింది. సివిల్ సర్వీసెస్ పరీక్ష ద్వారా ఐఏఎస్, ఐపీఎస్, ఇండియన్ ఫారిన్ సర్వీసెస్(ఐఎఫ్‌ఎస్) తదితర ప్రతిష్టాత్మక విభాగాలకు ఉద్యోగులను ఎంపిక చేస్తారు. ఈ పరీక్ష ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అనే మూడుస్థాయిల్లో జరుగుతుంది.

పరీక్ష  ప్రక్రియ పూర్తయ్యాకే సమాచారం..

సమాచార హక్కు చట్టం కింద తాము సాధించిన మార్కుల వివరాలను కోరుతూ దరఖాస్తులు చేయవద్దని యూపీఎస్సీ అభ్యర్థులకు విజ్ఞప్తి చేసింది. మొత్తం ప్రక్రియ ముగిసి, ఫైనల్ రిజల్ట్స్ ప్రకటించిన తరువాత మాత్రమే అభ్యర్థులు పొందిన మార్కులు, కటాఫ్ మార్కులు, ఆన్సర్ కీ వివరాలను వెల్లడిస్తామని స్పష్టం చేసింది. అందువల్ల ఆర్టీఐ చట్టం ప్రకారం ఆ వివరాల కోసం దరఖాస్తు చేయవద్దని అభ్యర్థులను కోరింది. ప్రిలిమ్స్ పరీక్ష పేపర్ 2(సీశ్యాట్) ఆంగ్ల మాధ్యమ విద్యార్థులకే అనుకూలంగా ఉందని, ఆ పేపర్ విధానాన్ని మార్చాలని కోరుతూ ప్రిలిమ్స్ పరీక్ష ముందు అభ్యర్థులు పెద్ద ఎత్తున నిరసనలు నిర్వహించారు. దాంతో ఆ పేపర్‌లోని ఇంగ్లిష్ విభాగ మార్కులను పరిగణనలోకి తీసుకోబోమని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement