రాజీవ్ హత్య వెనుక రాజకీయం! | rajiv gandhi murder case: Perarivalan plea adjourned | Sakshi
Sakshi News home page

రాజీవ్ హత్య వెనుక రాజకీయం!

Nov 30 2013 8:30 AM | Updated on Sep 2 2017 1:06 AM

రాజీవ్ హత్య వెనుక రాజకీయం!

రాజీవ్ హత్య వెనుక రాజకీయం!

మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య వెనుక రాజకీయం ఉందని ఈ కేసుకు సంబంధించి వేలూరు జైలులో ఉన్న పెరరివాళన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

 చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య వెనుక రాజకీయం ఉందని ఈ కేసుకు సంబంధించి వేలూరు జైలులో ఉన్న పెరరివాళన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. హత్య వెనుక రాజకీయం ఉన్నందునే కేసు విచారణ ముగింపులో జాప్యం జరుగుతోందని చెన్నైలోని టాడా కోర్టులో గురువారం వేసిన పిటిషన్‌లో ఆరోపించాడు. 14 ఏళ్లుగా సాగుతున్న సీబీఐ విచారణలో పురోగతి లేదని, హత్య వెనుక రాజకీయ నేతల ప్రమేయం ఉన్నందునే విచారణలో జాప్యం జరుగుతోందన్నాడు. కోర్టు పర్యవేక్షణలో ఈ విచారణ సాగేలా చూడాలని పిటిషన్‌లో అభ్యర్థించాడు.

పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు సీబీఐ ఇంతవరకు రూ.100 కోట్లు ఖర్చు చేసిందని అతని తరపు న్యాయవాది ఎన్ చంద్రశేఖర్ చెప్పారు. పిటిషన్ లో పేరరివాళన్ పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్టీటీఈ ఇంటెలిజెన్ విభాగం అధినేత బొట్టు అమ్మన్ తో పాటు మరి కొందరు నిందితులు ఇంతవరకు పట్టుబడలేదన్నారు. రాజీవ్ హత్యకేసు విచారణ ముగిసిన తర్వాత సీబీఐ అధికారులతో కూడిన ప్రత్యేక విచారణ బృందాన్ని 1999  జూన్ 17న కేంద్ర ప్రభుత్వం నియమించిందని తెలిపారు.

రాజీవ్ హత్యకేసు విచారణలో పురోగతిని వివరిస్తూ టాడా కోర్టుకు వీరు ప్రతినెలా ఒక రహస్య నివేదికను అందజేస్తారని చెప్పారు. అయితే 14 ఏళ్లుగా సాగుతున్న సీబీఐ విచారణలో ఎటువంటి పురోగతి లేనందున బాధితునిగా మిగిలానని పేరరివాళన్ కోర్టుకు విన్నవించారు. విచారణ సక్రమంగా సాగితే రాజీవ్ హత్య వెనుకనున్న నిజాలు బయటపడతాయని చెప్పారు. హత్యలో కొందరు రాజకీయ నాయకులు, అధికారుల ప్రమేయం ఉన్నందునే విచారణలో జాప్యం జరుగుతోందని ఆరోపించారు.

ఇంతవరకు విచారించిన వారినే మరోసారి విచారించేలా ప్రత్యేక బృందాన్ని నియమించాలని, ఈ బృందం న్యాయస్థాన పర్యవేక్షణలో సాగేదిగా ఉండాలని ఆయన కోరారు. నిజాలను నిక్కచ్చిగా వెలికితీసేలా వారికి స్పష్టమైన ఆదేశాలు సైతం ఇవ్వాలని కోరారు. పేరరివాళన్ దాఖలు చేసిన ఈ పిటిషన్ పై గురువారం టాడాకోర్టు విచారణ జరిపింది. సీబీఐ తరపున రంగనాధన్, పేరరివాళన్ తరపున ఎన్ చంద్రశేఖర్ వాదించారు. తీర్పును వచ్చేనెల 10వ తేదీకి వాయిదా వేశారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement