రెండేళ్లలో రూ 5000 కోట్ల ఆదా

railways save rs 5000cr on power bills - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: భారతీయ రైల్వేలు ఏప్రిల్‌ 2015 నుంచి అక్టోబర్‌ 2017 వరకూ విద్యుత్‌ బిల్లుల్లో రూ 5636 కోట్లు ఆదా చేసినట్టు వెల్లడించాయి.రానున్న పదేళ్లలో మొత్తం రూ 41,000 కోట్లు ఆదా చేస్తామని అంచనా వేశాయి. ఓపెన్‌ యాక్సెస్‌ ఏర్పాట్ల ద్వారా భారీగా విద్యుత్‌ బిల్లుల్లో ఆదా చేసినట్టు తెలిపాయి.

ఎలక్ట్రిసిటీ చట్టం, 2013 ప్రకారం ఓపెన్‌ యాక్సెస్‌ విధానం కింద ఒక మెగావాట్‌ కన్నా ఎక్కువ విద్యుత్‌ను ఉపయోగించే వినియోగదారులు నేరుగా మార్కెట్‌ నుంచి విద్యుత్‌ను సమీకరించుకునే వెసులుబాటు ఉంది. మహారాష్ట్ర, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌,జార్ఖండ్‌, రాజస్థాన్‌, హర్యానా, కర్ణాటక, దామోదర్‌ వ్యాలీ కార్పొరేషన్‌ ఏరియాల్లో ఓపెన్‌ యాక్సెస్‌ రూట్‌ ద్వారా రైల్వేలు తమకు అవసరమైన విద్యుత్‌ను సమీకరిస్తున్నాయి.

వచ్చే ఏడాది నుంచి ఓపెన్‌ యాక్సెస్‌ రూట్‌లో విద్యుత్‌ను అందించేందుకు బీహార్‌, యూపీ, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు ఆమోదం తెలిపాయని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. ఈ విధానం ద్వారా రాబోయే పదేళ్లలో రూ 41,000 కోట్ల మేరకు విద్యుత్‌ బిల్లులు ఆదా అవుతాయని వెల్లడించాయి. ఈ మొత్తాన్ని మిషన్‌ ఎలక్ర్టిఫికేషన్‌ కింద రైల్వే నెట్‌వర్క్‌ విద్యుదీకరణకు వెచ్చిస్తామని రైల్వేలు తెలిపాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top