
కమల్ హసన్, గోపీచంద్ కు పద్మభూషణ్ ప్రదానం
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం ప్రతిష్టాత్మక పద్మ అవార్డులను ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులను బహూకరించారు.
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం ప్రతిష్టాత్మక పద్మ అవార్డులను ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులను బహూకరించారు. దేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ను శాస్త్రవేత్త రఘునాథ్ అనంత్ మషేల్కర్కు అందజేశారు. ఇక ప్రముఖ సినీ నటుడు కమల్ హసన్, బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపీచంద్ సహా 12 మంది ప్రమఖులు పద్మభూషణ్ అవార్డులు స్వీకరించారు. ఇక 53 మందికి పద్మశ్రీ అవార్డులను అందజేశారు. వీరిలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని మన్మోహన్ సింగ్, హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే పాల్గొన్నారు.