
సాక్షి, న్యూఢిల్లీ: 69వ గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి రామనాధ్ కోవింద్ భావోద్వేగానికి లోనయ్యారు. రిపబ్లిక్ డే సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన రాష్ట్రపతి అవార్డుల ప్రదానం సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఉగ్రవాదులతో పోరులో అసువులు బాసిన కార్పొరల్ ‘జ్యోతి ప్రకాష్ నిరాలా’కు ప్రకటించిన అశోక్ చక్ర అవార్డును అందించిన అనంతరం ఆయన కొద్దిసేపు ఉద్వేగానికి లోనయ్యారు. దీంతో అక్కడ వాతావరణం మరింత గంభీరంగా మారిపోయింది. అమరుడు జ్యోతి ప్రకాష్ తరపున ఆయన భార్య సుష్మానంద్ రాష్ట్రపతి చేతుల మీదుగా అశోక్ చక్ర శౌర్య పతకాన్ని అందుకున్నారు. ఆమె వెంట జ్యోతి ప్రకాష్ తల్లి మాలతీదేవి కూడా ఉన్నారు.
కాగా, గణతంత్ర దినోత్సవం సందర్భంగా 390 మంది అధికారులకు రాష్ట్రపతి సాహస పురస్కారాలు లభించాయి.. వీటిలో ఒక కీర్తి చక్ర, 14 శౌర్య చక్ర, 28 పరమ్ విశిష్ట సేవా పతకాలు, 4 ఉత్తమ్ యుద్ధ్ సేవా పతకాలు ఉన్నాయి. ఉత్తమ సేవలు అందించిన 27 మంది సీబీఐ అధికారులకు కూడా రాష్ట్రపతి పురస్కారాలు ప్రకటించిన సంగతి తెలిసిందే.