మాకు క‌రోనా సోకుతుంది.. శ‌వాన్ని తీసుకురావొద్దు

Police Lathicharge On  Villagers Trying To Disrupt  Woman Cremation - Sakshi

చండీగఢ్‌ : క‌రోనా సోకిందేమో అన్న అనుమానంతో గ్రామ‌స్తులు ఓ మ‌హిళ అంత్య‌క్రియ‌లు అడ్డుకున్నారు. పోలీసులు రంగంలోకి దిగి సర్ధిచెప్పే ప్ర‌య‌త్నం చేసినా విన‌క‌పోవ‌డంతో వారిపై లాఠీచార్జ్ ప్ర‌యోగించారు. పంజాబ్‌లోని అంబాల కంటోన్మెంట్‌ సమీపంలోని చంద్‌పురా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే.. సోమ‌వారం ఓ మ‌హిళ శ్వాస‌కోస స‌మ‌స్య‌ల‌తో బాధప‌డుతూ సోమవారం క‌న్నుమూసింది. ద‌హ‌న‌సంస్కారాల నిమిత్తం బందువులు మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్తుండ‌గా, అక్క‌డి స్థానికులు అడ్డుకున్నారు. క‌రోనా సోకి చనిపోయివుండొచ్చ‌నే అనుమానంతో అడ్డుత‌గిలారు.

దీంతో మృతురాలి బంధువులు పోలీసులను ఆశ్ర‌యించ‌గా రంగంలోకి దిగిన పోలీసులు గ్రామ‌స్తుల‌కు సర్దిచెప్పే ప్ర‌య‌త్నం చేశారు. అంతేకాకుండా ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా కోవిడ్ ప‌రీక్ష‌ల కోసం న‌మూనా సేక‌రించిన‌ట్టు ఆసుప‌త్రి వ‌ర్గాలు సైతం చెప్పాయ‌ని పేర్కొన్నారు. అయిన‌ప్ప‌టికీ గ్రామ‌స్తులు విన‌క‌పోవ‌డంతో ప‌రిస్థితిని అదుపుచేసేందుకు స్వ‌ల్పంగా లాఠీచార్జ్ చేయాల్సి వ‌చ్చింద‌ని పోలీస్ సీనియ‌ర్ అధికారి ఒక‌రు వెల్ల‌డించారు. ఎట్ట‌కేల‌కు మృతురాలి ద‌హ‌న సంస్కారాలు జ‌రిపించామ‌ని అంబాలా పోలీసు సూపరింటెండెంట్ అభిషేక్ జోర్వాల్ తెలిపారు. ఈ ఘటన​కు సంబంధించి పలువురిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top