
‘నల్లధనం’ బిల్లుకు ఆమోదం
విదేశాల్లో దాచిన నల్లధనానికి సంబంధించి కఠిన చర్యలతో కూడిన బిల్లును బుధవారం పార్లమెంటు ఆమోదించింది. విదేశాల్లో అక్రమ ఆస్తులు దాచిన వారు..
మరో రెండు ముఖ్యమైన బిల్లులకు లోక్సభ ఓకే
న్యూఢిల్లీ: విదేశాల్లో దాచిన నల్లధనానికి సంబంధించి కఠిన చర్యలతో కూడిన బిల్లును బుధవారం పార్లమెంటు ఆమోదించింది. విదేశాల్లో అక్రమ ఆస్తులు దాచిన వారు.. వాటిని వెల్లడించేందుకు గల గడువును వినియోగించుకోవాలని సూచించిం ది. లేదంటే ప్రపంచ ఆటోమేటిక్ సమాచార మార్పిడి వ్యవస్థ 2017లో అమలులోకి వస్తుందని.. ఆ తర్వాత ఇటువంటి వారు నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుందని హెచ్చరించింది. నల్లధనాన్ని అరికట్టేందుకు ఈ కొత్త చట్టం ఉపయోగపడుతుందని ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ రాజ్యసభలో పేర్కొన్నారు. రెండు రోజుల కిందట లోక్సభ ఆమోదం పొందిన ‘నల్ల ధనం (బహిర్గతం చేయని విదేశీ ఆదాయం, ఆస్తులు) మరియు పన్ను విధింపు బిల్లు - 2015’ను బుధవారం రాజ్యసభ కూడా ఆమోదించింది. ఇది చరిత్రాత్మక ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభివర్ణించారు. ఈ అంశానికి తాము ఇస్తున్న ప్రాధాన్యతను ఇది సూచిస్తోందని ట్విటర్లో వ్యాఖ్యానించారు. అలాగే.. విజిల్బ్లోయర్స్ ప్రొటెక్షన్ (సవరణ) బిల్లు - 2015 (సామాజిక సమాచార ఉద్యమకారుల పరిరక్షణ బిల్లు)ను లోక్సభ ఆమోదించింది.
అలాగే.. చెక్కుల తిరస్కరణ (బౌన్స్) కేసుల్లో కేసుల నమోదును మరింత సరళం చేసేందుకు ఉద్దేశించిన నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ (సవరణ) బిల్లును లోక్సభ ఆమోదించింది. ఇక లోక్సభలో పెండింగ్లో ఉన్న జాతీయ జలమార్గాల బిల్లు, పరిహారపూరిత అటవీకరణ నిధి బిల్లు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల అభివృద్ధి బిల్లులను స్థాయీ సంఘాలకు నివేదించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి రాజీవ్ప్రతాప్ రూడీ తెలిపారు. నేపాల్లో, భారత్లోని పలు ప్రాంతాల్లో మంగళవారం సంభవించిన భూకంపం కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోవటం పట్ల లోక్సభ విచారం వ్యక్తంచేసింది.
ఉభయసభలూ నిరవధిక వాయిదా: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు బుధవారంతో ముగిశాయి. లోక్సభ, రాజ్యసభ రెండూ నిరవధికంగా వాయిదాపడ్డాయి. ఇటీవలి సంవత్సరాల్లో రికార్డు స్థాయిలో అధికారిక కార్యక్రమాలు జరగటం ఈ సమావేశాల విశేషం. అయితే.. విపక్షాలప్రతిఘటన కారణంగా.. వివాదాస్పదమైన భూ సేకరణ బిల్లు, కీలకమైన ఆర్థిక సంస్కరణకు ఉద్దేశించిన జీఎస్టీ బిల్లులను ప్రభుత్వం పార్లమెంటు ఆమోదం పొందలేకపోయింది. లోక్సభ షెడ్యూల్డు పని గంటల్లో 117 శాతం, రాజ్యసభ షెడ్యూల్డు పని గంటల్లో 101 శాతం ఫలవంతంగా పనిచేశాయని.. గత పదేళ్లలో ఇదే అత్యుత్తమమని ప్రభుత్వం పేర్కొంది.