మెడలో చెప్పుల దండ.. ముఖంపై నలుపు రంగు | NSUI leaders Put Shoe Garland Around Savarkar Statue | Sakshi
Sakshi News home page

విద్యార్థి సంఘాల మధ్య వివాదం.. విగ్రహానికి అవమానం

Aug 22 2019 9:26 AM | Updated on Aug 22 2019 9:54 AM

NSUI leaders Put Shoe Garland Around Savarkar Statue - Sakshi

న్యూఢిల్లీ: రెండు పార్టీలకు చెందిన విద్యార్థి సంఘాల మధ్య విబేధాలు ఓ విపరీతానికి దారి తీశాయి. అనుమతి లేకుండా యూనివర్సిటీ ఆవరణలో సావర్కర్‌ విగ్రహం ప్రతిష్టించారంటూ.. దాని మెడలో చెప్పుల దండ వేయడమే కాక.. విగ్రహం ముఖానికి నలుపు రంగు పూశారు. ఈ సంఘటన ఢిల్లీ విశ్వవిద్యాలయంలో చోటు చేసుకుంది. వివరాలు.. ఢిల్లీ యూనివర్సిటీలోని కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐ.. హిందు మహాసభ అధ్యక్షుడైన వీర్ సావర్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసి అవమానించింది. అనుమతి లేకపోయినా యూనివర్సిటీ ప్రాంగణంలో విగ్రహాన్ని పెట్టారన్న కారణంతో.. చెప్పుల దండ వేసి, ముఖానికి నలుపు రంగు పూసింది.

మంగళవారం ఉదయం వర్సిటీలోని ఏబీవీపీ అధ్యక్షుడు శక్తి సింగ్ ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహ ఏర్పాటు అనుమతి కోసం ఢిల్లీ వర్సిటీ అడ్మినిస్ట్రేషన్ చుట్టూ తాను చాలాసార్లు తిరిగానని.. కానీ ఎవరూ పట్టించుకోలేదని శక్తి సింగ్ తెలిపాడు. ఇక చేసేదేమీ లేక.. తామే విగ్రహాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. సావర్కర్ వంటి వ్యక్తుల విగ్రహాలు యువతకు స్ఫూర్తినిస్తాయని.. అందుకే ఏర్పాటు చేశామని అన్నారు. అయితే ఎన్‌ఎస్‌యూఐ దీన్ని అంగీకరించడం లేదు. చంద్రబోస్, భగత్ సింగ్‌ లాంటి మహనీయుల సరసన.. సావర్కర్ విగ్రహాన్ని పెట్టడం సరికాదని ఎన్ఎస్‌యూఐ వాదిస్తోంది. ముగ్గురి విగ్రహాలు ఒకేచోట కలిపి పెట్టడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. అంతేకాక 24గంటల్లోగా విగ్రహాన్ని తొలగించకపోతే వర్సిటీ ముందు ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. కానీ ఈలోపే విగ్రహానికి చెప్పుల దండ వేసి, నలుపు రంగు పూయడం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement