
రాష్ట్రాలపై చక్కెర భారం
రాష్ట్రాలపై రేషన్ చక్కెర భారం పడనుంది. రేషన్ షాపుల్లో ఇస్తున్న చక్కెర ధరను నిర్ణయించుకొనే స్వేచ్ఛ రాష్ట్రాలకే ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయించింది.
* సబ్సిడీని కిలోకు రూ. 32 నుంచి రూ. 18.50కు తగ్గించిన కేంద్రం
* రేషన్ చక్కెర ధరలు
* ఇక రాష్ట్రాలే నిర్ణయించుకోవాలి
న్యూఢిల్లీ: రాష్ట్రాలపై రేషన్ చక్కెర భారం పడనుంది. రేషన్ షాపుల్లో ఇస్తున్న చక్కెర ధరను నిర్ణయించుకొనే స్వేచ్ఛ రాష్ట్రాలకే ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయించింది. 2002 నుంచి చౌకదుకాణాల్లో ఇస్తున్న చక్కెర కిలో ధర రూ. 13.50గా ఉంది. అదే సమయంలో కేంద్రం కిలో కు రూ.32 దాకా సబ్సిడీ ఇస్తోంది. ఇప్పుడీ సబ్సిడీని రూ.18.50కు కుదించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. అంటే కిలోకు 13.50 రూపాయల చొప్పున భారం రాష్ట్రాలపై పడనుంది.
తెలంగాణపై రూ. 65 కోట్ల భారం
తెలంగాణలోని రేషన్ షాపుల ద్వారా నెలకు నాలుగు వేల మెట్రిక్ టన్నుల చక్కెర పంపిణీ అవుతోంది. కిలోకు రూ.13.50 చొప్పున 5.4 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది. అంటే ఏడాదికి 64.8 కోట్ల రూపాయలు. ఒకవేళ రాష్ట్రం ఇది భారమని భావిస్తే, ఆ మేరకు ధరను పెంచాల్సి వస్తుంది. అప్పుడు రేషన్ దుకాణాల్లో చక్కెర కిలోకు 27 చెల్లించాల్సి వస్తుంది.