ఎవ్వరికీ వ్యక్తిగత గోప్యత మిగల్లేదు | No privacy left for anybody says Supreme Court | Sakshi
Sakshi News home page

ఎవ్వరికీ వ్యక్తిగత గోప్యత మిగల్లేదు

Nov 5 2019 3:48 AM | Updated on Nov 5 2019 3:48 AM

No privacy left for anybody says Supreme Court  - Sakshi

న్యూఢిల్లీ: ఓ ఐపీఎస్‌ అధికారి ఫోన్‌ ట్యాపింగ్‌ విషయమై సుప్రీంకోర్టు తీవ్రంగా ప్రతిస్పందించింది. ‘ఎవ్వరికీ వ్యక్తిగత గోప్యత మిగలలేదు’ అని వ్యాఖ్యానించింది. ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం ఓ ఐపీఎస్‌ అధికారికీ, వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫోన్‌లను ట్యాప్‌చేయడంపై కోర్టు స్పందించింది. ఫోన్‌ ట్యాపింగ్‌ చేసి పౌరుల వ్యక్తిగత గోప్యత హక్కును ఇలా హరించివేయొచ్చా? అంటూ ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అసలు మిమ్మల్ని ఫోన్‌ ట్యాప్‌ చేయాలని ఆదేశించెందెవరో, అందుకు కారణాలేమిటో పూర్తివివరాలను కోర్టుముందుంచాల్సిందిగా∙ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

‘ఇలా చేయడానికి కారణమేమిటి? ఏ ఒక్కరికీ వ్యక్తిగత గోప్యత హక్కు మిగల్లేదు. అసలీ దేశంలో ఏం జరుగుతోంది?’అని కోర్టు ప్రశ్నించింది. ఎవరివ్యక్తిగత విషయాలపైనైనా నిఘావేసి, వారి వ్యక్తిగత గోప్యతను హరించివేయొచ్చా అని కోర్టు ప్రశ్నించింది. ఐపీఎస్‌ అధికారి తరఫున వాదిస్తోన్న న్యాయవాదిపై ప్రత్యేక ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయినప్పటికీ తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు అతనిపై బలవంతంగా ఎటువంటి చర్యలు తీసుకోరాదని కోర్టు స్పష్టం చేసింది.

ఈ యేడాది ఫిబ్రవరి 9న సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ కుంభకోణంలో ఆర్థిక ఆరోపణలపై స్పెషల్‌ డీజీపీ ముఖేష్‌ గుప్తా సహా ఇద్దరు అధికారులను ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఫిబ్రవరి 2015లో 25 సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ కార్యాలయాల్లో ఏసీబీ, ఈఓడబ్ల్యూ ఏకకాలంలో నిర్వహించిన దాడుల్లో ఈ కుంభకోణం బయటపడింది. అయితే ఈ కోట్లాదిరూపాయల కుంభకోణంపై దర్యాప్తు జరిపేందుకు బాగెల్‌ ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 8న ఇన్స్‌పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ నేతృత్వంలో 12 మంది సభ్యులతో దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement