ప్రపంచ రికార్డు సృష్టించిన ముంబై ఎయిర్‌పోర్టు

Mumbai airport handles 969 flights, sets new world record - Sakshi

సాక్షి, ముంబై: ముంబైలోని సహార్‌ ప్రాంతంలో ఉన్న ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ప్రపంచ రికార్డు సృష్టించింది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు ఇలా 24 గంటల్లో ఒకే రన్‌ వే పై ఏకంగా 969 విమానాల (టేకాఫ్‌, ల్యాండింగ్‌) రద్దీని నియంత్రించి నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. అందుకు ప్రధాన కారణం ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ఏటీసీ) సిబ్బంది సమన్వయం, ఒక ప్రణాళిక బద్దంగా పనిచేయడం వల్లే ఇది సాధ్యమైందని ఎయిర్‌ పోర్టు అథారిటీ వర్గాలు తెలిపాయి.

2006 వరకు ముంబై విమానాశ్రయంలో గంటకు 30 విమానాల రాకపోకలు (టేకాఫ్‌, ల్యాండింగ్‌) ఏటీసీ సిబ్బంది నియంత్రించేవారు. ఆ తరువాత రెండేళ్లలో ప్రధాన రన్‌ వేలో మార్పులు, ఆధునిక రాడార్, ఇతర సాంకేతిక పరికరాలవల్ల ఈ సంఖ్య 52కు చేరింది. ఇదివరకు 24 గంటల్లో 852 విమనాలు రాకపోకలు సాగించినట్లు రికార్డులు ఉన్నాయి. ప్రతీరోజు రాకపోకలు సాగించే విమానాలకు తోడుగా ఎప్పుడైన అదనంగా విమానాల సంఖ్య పెరిగితే వాటిని నియంత్రించే సామర్ధ్యం తమ సిబ్బందికి ఉందని ఏటీసీ జనరల్‌ మేనేజరు ఆర్‌.కే.సక్సేనా పేర్కొన్నారు.

శుక్రవారం రాత్రి మొదలుకుని శనివారం రాత్రి వరకు ఇలా 24 గంటల్లో మొత్తం 969 విమానాలను నియంత్రించినట్లు ఆయన చెప్పారు. అయితే ఏ సమయంలో ఎక్కువ విమానాలు టేకప్, ల్యాండింగ్‌ అయ్యాయనేది చెప్పడం కష్టమని తెలిపారు. కాగా నిర్వాహణ పనుల కోసం ప్రతీరోజు రన్‌ వే ను ఒక గంటసేపు మూసి ఉంచాలనేది నియమాలున్నాయి. ఆ ప్రకారం 23 గంటల్లోనే 969 విమనాలను నియంత్రించి రికార్డు సృష్టించినట్లు స్పష్టమైతోందని ఆయన అన్నారు.

ఇదిలాఉండగా ముంబై విమానాశ్రయంలో ప్రధాన రన్‌ వేపై ఏ–380 లాంటి భారీ విమానాలు టేకాప్, ల్యాండింగ్‌ చేసే సామర్థ్యం ఉంది. దీంతో ఈ రన్‌ వే కు క్యాట్‌–3 గ్రేడ్‌ లభించింది. సాధ్యమైనంత వరకు రన్‌ వే ను ఖాళీ చేస్తే వెనక వచ్చే విమనాలకు అవకాశం లభిస్తుంది. పూర్వం ఒక్కో విమానం ల్యాండింగ్‌ లేదా టేకప్‌ చేయడానానికి 60 సెకండ్లకు పైగా సమయం పట్టేది. ఇప్పుడు 47–48 సెకండ్లు మాత్రమే సమయం పడుతుంది. దీంతో విమానాలు రన్‌ వే మీదుగా టేకప్‌ లేదా ల్యాండింగ్‌ ఎక్కువ సంఖ్యలో చేయడానికి వీలుపడుతుందని సక్సేనా అన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top