బ్యాంకులు, టెలికంలపై లక్షల్లో ఫిర్యాదులు
సాక్షి, న్యూఢిల్లీ : గడిచిన మూడేళ్లలో ప్రజల ఆర్థిక లావాదేవీలకు కీలకమైన బ్యాంకులపైన, సమాచార భట్వాడాకు సంబంధించిన టెలికం డిపార్ట్మెంట్పైనే అధిక ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం బుధవారం నాటి ప్రశ్నోత్తరాల సమయంలో లోక్సభలో వెల్లడించింది.
గత ఏడాదిలో బ్యాంకు రంగానికి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసు(డీఎఫ్ఎస్)కు మొత్తం లక్షా 6వేల 299 ఫిర్యాదులు, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యునికేషన్స్(డీఓటీ)కు లక్షా 21వేల 75 ఫిర్యాదులు అందినట్లు కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ తెలిపారు. అదేవిధంగా 2016, 2015లో డీఎఫ్ఎస్కు వరుసగా 88,850 ఫిర్యాదులు, 53,776 ఫిర్యాదులు అందాయని, డీఓటీకి 2016, 2015లో వరుసగా 67,551, 63,929 ఫిర్యాదులు అందినట్లు పేర్కొన్నారు. అయితే, వీటిలో చాలా సమస్యలు పరిష్కరించినట్లు కూడా మంత్రి వెల్లడించారు.