‘మోదీ హయాంలో సూపర్ ఎమర్జెన్సీ’
కోల్కతా : కేంద్రంలో నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వ హయాంను 44 ఏళ్ల కిందట ఇందిరా గాంధీ దేశంలో విధించిన ఎమర్జెన్సీతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోల్చారు. ఎమర్జెన్సీ పాఠాల నుంచి దేశం గుణపాఠాలు నేర్చుకుని, ప్రజాస్వామ్య వ్యవస్ధలను కాపాడుకోవాలని ఆమె హితవు పలికారు. ‘ఇవాళ మనం దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించి 44 ఏళ్లు పూర్తయిన సందర్భం గుర్తుచేసుకుంటున్న క్రమంలో గత ఐదేళ్లుగా దేశంలో సూపర్ ఎమర్జెన్సీ నడుస్తోందని, చరిత్ర నుంచి మనం గుణపాఠాలు నేర్చుకుని దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్ధల పరిరక్షణకు పోరాడా’లని ఆమె ట్వీట్ చేశారు.
కాగా గత కొన్నేళ్లుగా పలు అంశాలపై మోదీ ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలను మమతా బెనర్జీ ఎత్తిచూపుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు బెంగాల్లో ఎన్నికల అనంతర హింసాకాండలో బీజేపీ, తృణమూల్ కార్యకర్తలు మరణించడంతో ఇరు పార్టీల మధ్య ఘర్షణలు తారాస్ధాయికి చేరాయి.