కేజ్రీవాల్‌పై ఏసీబీకి సాక్ష్యాలు | Kapil Mishra submits 'evidence' against Kejriwal to ACB | Sakshi
Sakshi News home page

కేజ్రీవాల్‌పై ఏసీబీకి సాక్ష్యాలు

May 9 2017 1:41 AM | Updated on Aug 17 2018 12:56 PM

కేజ్రీవాల్‌పై ఏసీబీకి సాక్ష్యాలు - Sakshi

కేజ్రీవాల్‌పై ఏసీబీకి సాక్ష్యాలు

రూ.400 కోట్ల మంచినీళ్ల ట్యాంకర్ల కుంభకోణంలో దర్యాప్తు నివేదికను కేజ్రీవాల్‌ తొక్కిపెట్టారంటూ ఆప్‌ మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన కపిల్‌ మిశ్రా ఏసీబీ అధికారులకు ఫిర్యాదుచేశారు.

నేడు సీబీఐకి ఫిర్యాదు చేస్తా: కపిల్‌ మిశ్రా  
సాక్షి, న్యూఢిల్లీ: రూ.400 కోట్ల మంచినీళ్ల ట్యాంకర్ల కుంభకోణంలో దర్యాప్తు నివేదికను కేజ్రీవాల్‌ తొక్కిపెట్టారంటూ ఆప్‌ మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన కపిల్‌ మిశ్రా ఏసీబీ అధికారులకు ఫిర్యాదుచేశారు. అందుకు సంబంధించిన సాక్ష్యాల్ని సోమవారం ఆయన అందచేశారు. కేజ్రీవాల్‌కు సత్యేంద్రజైన్‌ ఇచ్చిన రూ. 2 కోట్ల లంచంపై సీబీఐకు ఫిర్యాదు చేస్తానని, అందుకోసం మంగళవారం 11.30గంటలకు సీబీఐ అపాయింట్‌మెంట్‌ ఇచ్చినట్లు మిశ్రా చెప్పారు. ఇదిలా ఉండగా పార్టీ అధినేత కేజ్రీవాల్‌పై ఆరోపణలు చేసినందుకుగానూ కపిల్‌ను పార్టీ ప్రాధమిక సభ్యత్వం నుంచి తొలగిస్తూ ఆప్‌ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సోమవారం సాయంత్రం నిర్ణయం తీసుకుంది.

కేజ్రీవాల్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని ఏసీబీని ఢిల్లీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ ఆదేశించారు. మరోవైపు అవినీతిపరుడంటూ కేజ్రీవాల్‌ పదే పదే ఆరోపించిన ఏసీబీ చీఫ్‌ ఎంకే మీనానే ఈ కేసును దర్యాప్తు చేయనున్నారు. ఏసీబీ కార్యాలయం వెలుపల మిశ్రా మాట్లాడుతూ.. పూర్తిస్థాయి విచారణ కోసం ఏసీబీ మళ్లీ పిలుస్తుందని, తాను చేసిన ఆరోపణలపై లైడిటెక్టర్‌ టెస్ట్‌కు సిద్ధమని, కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్‌ కూడా టెస్ట్‌లో పాల్గొనాలని ఆయన సవాలు విసిరారు. వాటర్‌ ట్యాంకర్‌ కుంభకోణంలో మాజీ సీఎం షీలాదీక్షిత్‌ను రక్షించేందుకు ఆప్‌ సర్కారు ప్రయత్నించిందని, ఆ సాక్ష్యాలను ఏసీబీకి సమర్పించినట్లు చెప్పారు.  

సత్యానిదే తుది విజయం: కేజ్రీవాల్‌
తనపై ఆరోపణలకు కేజ్రీవాల్‌ స్పందిస్తూ.. సత్యానిదే తుది విజయమని ట్వీట్‌ చేశారు. కపిల్‌ మిశ్రాను ఉపయోగించుకుని బీజేపీ కుట్ర పన్నిందని ఆప్‌ ఆరోపించింది. ఆ పార్టీ నాయకుడు సంజయ్‌ సింగ్‌ విలేకరులతో మాట్లాడుతూ ఇవి నిరాధార ఆరోపణలేనని కొట్టిపారే శారు. కేబినెట్‌ నుంచి తొలగించారన్న నిరాశలో మిశ్రా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement