పట్టాలెక్కనున్న మరో తేజాస్‌ ట్రైన్‌

IRCTC To Flag Off Its Second Tejas Train - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో తొలి ప్రైవేట్‌ రైలుగా లక్నో-ఢిల్లీ మధ్య నడిచే తేజాస్‌ ఎక్స్‌ప్రెస్‌ విజయవంతమైన క్రమంలో ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో ప్రైవేట్‌ ఆపరేటర్‌ అహ్మదాబాద్‌-ముంబై రూట్‌లో రెండో తేజాస్‌ ట్రైన్‌ పట్టాలెక్కనుంది. అహ్మదాబాద్‌ నుంచి ముంబైకు బయలుదేరే ఈ రైలుకు రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌, గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీలు శుక్రవారం ఉదయం పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు . రైలు వాణిజ్య రాకపోకలు ఈనెల 19 నుంచి లాంఛనంగా ప్రారంభమవుతాయి. ఇక ఈ రైలు బుకింగ్స్‌ను అధికారులు ఇప్పటికే ప్రారంభించారు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌తో పాటు మొబైల్‌ యాప్‌ ఐఆర్‌సీటీసీ రైల​కనెక్ట్‌ ద్వారా ప్రయాణీకులు తమ టికెట్లను బుక్‌ చేసుకోవచ్చు. రైల్వే రిజర్వేషన్‌ కౌంటర్లలో తేజాస్‌ ట్రైన్‌కు ప్రయాణీకులు టికెట్‌ బుక్‌ చేసుకునే వెసులుబాటు లేదు.

ఐఆర్‌సీటీసీ అధీకృత ఏజెంట్ల ద్వారా టికెట్లను బుక్‌ చేసుకునే సదుపాయం ఉంది. అహ్మదాబాద్‌- ముంబై మధ్య ఈ రైలు వారానికి ఆరు రోజులు అందుబాటులో ఉంటుంది. ఇక గురువారం మెయింటెనెన్స్‌ కోసం ఉద్దేశించడంతో ఆ రోజు రైలు సేవలు అందుబాటులో ఉండవు. పూర్తి ఏసీ ట్రైన్‌గా అత్యాధునిక సౌకర్యాలతో తేజాస్‌ ముందుకొచ్చింది. ఈ రైలులో ఒక్కోటి 56 సీట్ల సామర్ధ్యం కలిగిన రెండు ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ చైర్‌కార్స్‌తో పాటు ఎనిమిది చైర్‌ కార్స్‌తో మొత్తం 736 మంది ప్రయాణీకులు తమ గమ్యస్ధానాలకు చేరుకోవచ్చు. అహ్మదాబాద్‌ నుంచి బయలుదేరే ఈ ఎక్స్‌ప్రెస్‌ నదియాద్‌, వడోదర, బరూచ్‌, సూరత్‌, వాపి, బొరివలి మీదుగా ముంబైకు చేరుకుంటుంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top