‘నగదు కొరత అంతర్జాతీయ కుట్ర’ | International Conspiracy To Hit Indian Economy: Akhilesh | Sakshi
Sakshi News home page

‘నగదు కొరత అంతర్జాతీయ కుట్ర’

Apr 18 2018 3:38 PM | Updated on Mar 19 2019 5:52 PM

 International Conspiracy To Hit Indian Economy: Akhilesh - Sakshi

యూపీ మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌ (ఫైల్‌ఫోటో)

సాక్షి, లక్నో : భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు అంతర్జాతీయ కుట్ర జరుగుతోందని ఉత్తర్‌ ప్రదేశ్‌ మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌ ఆరోపించారు. దేశవ్యాప్తంగా ఏటీఎంల్లో నగదు కొరత తీవ్రంగా నెలకొన్న క్రమంలో అఖిలేష్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏటీఎంల్లో నగదు లేకుంటే మరి ఎక్కడ ఉందని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున కరెన్సీని ముద్రిస్తోంది..మరి ఏటీఎంల్లో నగదు లేకుంటే అది ఎక్కడ ఉంది..ప్రభుత్వ ఆదేశాలతో నగదును వెనక్కి మళ్లించారా..? అంటూ మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని అఖిలేష్‌ తప్పుపట్టారు.

నోట్ల ముద్రణకు ఉపయోగించే పేపర్‌, ఇంక్‌, యంత్రాలను విదేశాల నుంచి తెప్పిస్తున్నా నగదు కొరత నెలకొందని..భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు అంతర్జాతీయ కుట్ర సాగుతోందని ఆరోపించారు. మరోవైపు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఏటీఎంల్లో నగదు లేకపోవడంపై కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ సైతం మోదీ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. మోదీజీ బ్యాంకింగ్‌ వ్యవస్థను నాశనం చేశారని రాహుల్‌ ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement