క‌రోనా: ప్ర‌పంచంలో మూడో స్థానంలో భార‌త్‌

India Overtakes Russia Become Third Worst Hit Nation In Coronavirus Tally - Sakshi

కేసుల న‌మోదులో ప్ర‌తిరోజు కొత్త రికార్డే

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి మ‌హోగ్ర రూపం దాల్చింది. ఏ రోజుకారోజు అధిక సంఖ్య‌లో కేసులు న‌మోద‌వుతూ రికార్డులు సృష్టిస్తోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో సుమారు 25 వేల‌ పాజిటివ్‌ కేసులు న‌మోద‌వ‌గా 613 మంది మ‌ర‌ణించార‌ని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,73,165కి చేరింది. అయితే అదేరోజు సాయంత్రం నాటికి మ‌రిన్ని కేసులు వెలుగు చూడ‌టంతో మొత్తం కేసుల సంఖ్య 6.9 ల‌క్ష‌లుగా న‌మోదైంది. దీంతో 6.8 ల‌క్ష‌ల కేసులున్న‌ ‌ర‌ష్యాను వెన‌క్కునెట్టి ప్ర‌పంచంలో క‌రోనా ప్ర‌భావిత‌ జాబితాలో భార‌త్ మూడో స్థానానికి ఎగ‌బాకింద‌ని అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ యూనివ‌ర్సిటీ వెల్ల‌డించింది. అమెరికా(28 ల‌క్ష‌లు), బ్రెజిల్(15 ల‌క్ష‌లు) త‌ర్వాత స్థానంలో భార‌త్ నిలిచింది. (ఉగ్ర మహమ్మారి)

ఒక్క మ‌హారాష్ట్ర‌లోనే పాజిటివ్ కేసుల సంఖ్య రెండు ల‌క్ష‌ల మార్కును దాట‌డం క‌ల‌వ‌ర‌ప‌రిచే అంశం. గత 24 గంటల్లో మహారాష్ట్రలో 7,074 కేసులు, తమిళనాడులో 4,280 కేసులు నమోదయ్యాయి. మ‌రోవైపు దేశంలో మొత్తం మరణాల సంఖ్య 19,268కు చేర‌గా రికవరీ రేటు 60.77 శాతంగా నమోదయ్యింది. ఇదిలా వుండ‌గా క‌రోనా క‌ల్లోలానికి ముగింపు ప‌లికేందుకు అందుబాటులోకి తీసుకురానున్న‌ వ్యాక్సిన్‌ల ప్ర‌యోగాలు వేగ‌వంతం అయ్యాయి. అందులో భాగంగా కొవాక్సిన్‌, జైకొవ్‌-డీ అనే రెండు స్వ‌దేశీ క‌రోనా టీకాల‌ను మాన‌వ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌కు అనుమ‌తి ల‌భించిన విష‌యం తెలిసిందే. (కొత్తగా 24,850 కేసులు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top