
సాక్షి,న్యూఢిల్లీ: ఆదాయ పన్ను శాఖను విపక్షాలపై ఉసిగొల్పుతున్నారని విపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలను కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ తోసిపుచ్చారు. బీజేపీ నేతల కంపెనీలపైనా ఐటీ దాడులు జరుగుతున్నాయని మంత్రి చెప్పారు. ఏఐఏడీఎంకే నేత వీకే శశికళ, ఆమె కుటుంబ సభ్యులు, సన్నిహితులపై జరిగిన ఐటీ దాడుల నేపథ్యంలో తమిళనాడులో విపక్ష పార్టీలు కేంద్రం తమను టార్గెట్ చేస్తోందని ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.
అయితే పలు రాష్ట్రాల్లో బీజేపీ నేతలకు చెందిన కంపెనీలపైనా ఆదాయపన్ను దాడులు జరిగిన విషయం మరువరాదని కేంద్ర రహదారులు, హైవేలు, నౌకాయాన సహాయ మంత్రి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. విపక్షాలను లక్ష్యంగా చేసుకుని కేంద్రం ఐటీ దాడులు నిర్వహిస్తోందనే ఆరోపణలు అవాస్తవమని అన్నారు.
జీఎస్టీ పన్నురేట్ల తగ్గింపు ప్రజలకు ముఖ్యంగా పేదలు, చిన్న వ్యాపారులకు ఊరట ఇస్తుందని చెప్పారు. నూతన పన్ను వ్యవస్థ ప్రయోజనాలను త్వరలోనే వ్యాపారులు గ్రహిస్తారన్నారు. కాగా, డీఎంకే చీఫ్ కరుణానిధిని ఇటీవల ప్రధాని మోదీ కేవలం మర్యాదపూర్వకంగానే కలుసుకున్నారని స్పష్టం చేశారు.