నగరంలోని ఫ్లైఓవర్ పై ఓ లగ్జరీ కారు శుక్రవారం రాత్రి పూర్తిగా కాలి బూడిదైంది.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఫ్లైఓవర్ పై ఓ లగ్జరీ కారు శుక్రవారం రాత్రి పూర్తిగా కాలి బూడిదైంది. పని పూర్తి చేసుకుని ఇంటికి వెళుతున్న కారు ఓనర్ కపిల్ అగర్వాల్(32) కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అక్కడే ఆపి కిందకు దిగారు. వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం చేరవేశారు. ఫైర్ ఇంజన్ అక్కడి చేరుకునే లోపే కారు మొత్తం పూర్తిగా కాలిపోయింది.
ప్రముఖ నగల దుకాణం యజమాని అగర్వాల్ పేరు మీద కారు రిజిస్టర్ అయినట్లు పోలీసులు తెలిపారు. గత జనవరి నెలలో కారుకు సర్వీసింగ్ చేయించినట్లు అగర్వాల్ తెలిపారు. అంతకుముందు నుంచి చిన్నచిన్న సమస్యలు ఉన్నట్లు వెల్లడించారు. ఉన్నట్టుండి మంటలు రావడంతో అగర్వాల్ కార్ బానెట్ ను తెరచి చూశారని దీంతో ఒక్కసారి మంటలు రేగి కారు అంతా వ్యాపించినట్లు పోలీసులు వివరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.