
నాలుగు రాష్ట్రాలకూ పంచాల్సిందే!
కృష్ణా బేసిన్ పరిధిలోని ప్రాజెక్టులన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ఏ ప్రాజెక్టుకు ఎంత నీరివ్వాలనే అంశంపై నిర్ణయం తీసుకోవాలని, ఆపరేషన్ ప్రొటోకాల్ను ప్రకటించాలని బ్రిజేష్ ట్రిబ్యునల్ను తెలంగాణ ప్రభుత్వం కోరింది.
- కృష్ణా జలాలపై బ్రిజేష్ ట్రిబ్యునల్ ఎదుట రాష్ట్ర ప్రభుత్వ వాదనలు
- తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై త్రీడీ ప్రజెంటేషన్
- కృష్ణా బేసిన్లోని అన్ని ప్రాజెక్టులకు నీటి వాటాలు కేటాయించాలని విజ్ఞప్తి
- రాష్ట్రం తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది వైద్యనాథన్
సాక్షి, న్యూఢిల్లీ : కృష్ణా బేసిన్ పరిధిలోని ప్రాజెక్టులన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ఏ ప్రాజెక్టుకు ఎంత నీరివ్వాలనే అంశంపై నిర్ణయం తీసుకోవాలని, ఆపరేషన్ ప్రొటోకాల్ను ప్రకటించాలని బ్రిజేష్ ట్రిబ్యునల్ను తెలంగాణ ప్రభుత్వం కోరింది. విభజన చట్టంలోని సెక్షన్-89 ప్రకారం ప్రాజెక్టుల వారీగా నీటిని కేటాయించాల్సి ఉన్నందున.. జలాలను తెలంగాణ, ఏపీల మధ్యే పంపిణీ చేయాలా, లేక నాలుగు రాష్ట్రాల మధ్య పంచాలా అన్నదానిపై ట్రిబ్యునల్ రాష్ట్రాల అభిప్రాయాలను స్వీకరిస్తోంది. అందులో భాగంగా శుక్రవారం తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ వాదనలు వినిపించారు. నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు నాలుగు రాష్ట్రాలను లెక్కలోకి తీసుకుని నిష్పత్తి ప్రకారం వాడుకునేలా ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని, ప్రత్యేక రాష్ట్రంగా మారిన తెలంగాణకు అన్యాయం జరగరాదని కోరారు. తెలంగాణలో పరిస్థితిని చక్కదిద్దాలంటే కనీసం 500 టీఎంసీల కృష్ణా జలాలను కేటాయించాలని వివరించారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ట్రిబ్యునల్లోని ముగ్గురు న్యాయమూర్తులకు త్రీడీ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ఉమ్మడి ఏపీతో తీవ్ర అన్యాయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచీ తెలంగాణకు అన్యాయం జరుగుతోందని వైద్యనాథన్ ట్రిబ్యునల్కు వివరించారు. అంతకుముందు హైదరాబాద్ రాష్ట్రం పరిధిలో ఉన్న ఆలమట్టి, నారాయణపూర్, తుంగభద్ర ప్రాజెక్టులు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణతో ఇతర రాష్ట్రాల్లోకి వెళ్లిపోయాయని చెప్పారు. హైదరాబాద్ రాష్ట్రం అలాగే కొనసాగితే ఎక్కువ నీరు లభించేదని వివరించారు. బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఏపీకి మొత్తంగా 811 టీఎంసీలు కేటాయించిందని.. అందులో తెలంగాణకు 299 టీఎంసీలు, ఆంధ్రాకు 512 టీఎంసీలుగా ఒప్పందం జరిగిందని చెప్పా రు.
కానీ ఆ ఒప్పందం మేరకు కూడా తెలంగాణకు నీరు అందలేదని స్పష్టం చేశారు. 1972-73 నుంచి 2007-08 వరకు తెలంగాణకు సగటున ఏటా 262.66 టీఎంసీల నీరు మాత్రమే అందిందని వెల్లడించారు. ఆంధ్రా ప్రాంతం, మహారాష్ట్ర, కర్ణాటక అదనంగా నీటిని వాడుకున్నాయని వివరించారు. తెలంగాణలో సగటు వర్షపాతం తక్కువ అని, ఎత్తుగా ఉండడంతో వర్షాల వల్ల, కాల్వల వల్ల వచ్చే జలాల నిల్వకు ఆస్కారం లేదని తెలిపారు. వర్షపాతం అధికంగా ఉన్నందున మహారాష్ట్ర, కర్ణాటకల్లో నీటి లభ్యత, నిల్వ అధికమన్నారు. ఏపీలోని కృష్ణా డెల్టా ప్రాంతంలో వర్షాలు అధికమని, దాంతోపాటు తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో కురిసిన వర్షాల నీరు దిగువన ఉన్న ప్రకాశం బ్యారేజీకి చేరుతుందని ట్రిబ్యునల్కు వివరించారు.
అన్ని అంశాలు పరిశీలించండి
ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేసేటప్పుడు ట్రిబ్యునల్ పలు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని వైద్యనాథన్ వాదించారు. బేసిన్ పరిధిలో ఆ రాష్ట్రంలో ఉన్న ప్రాంతం, సాగుయోగ్యమైన భూమి, ప్రస్తుతం సాగవుతున్న భూమి, నీటి నిల్వ చేసుకోగల ప్రాజెక్టుల వివరాలను పరిశీలించాలని సూచించారు. నాలుగు రాష్ట్రాల్లోని మొత్తం ప్రాజెక్టులను లెక్కలోకి తీసుకొన్నప్పుడే ఏ ప్రాజెక్టుకు ఎంత నీటిని కేటాయించాల్సి ఉంటుందనే స్పష్టత లభిస్తుందన్నారు. ఆపరేషన్ ప్రొటోకాల్ను అమలు చేసే సమయంలో ఏటా జూన్లోనే నీటి విడుదల ఉండాలని ఆదేశించాల్సిన ఆవశ్యకత ఉందని స్పష్టం చేశారు. శనివారం కూడా వైద్యనాథన్ వాదనలు కొనసాగించనున్నారు.
త్రీడీ ప్రజెంటేషన్
కృష్ణా జలాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించడానికి వైద్యనాథన్ త్రీడీ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆలమట్టి, నారాయణపూర్ల నుంచి శ్రీశైలం వరకు కృష్ణా జలాలు ఏవి ధంగా వస్తున్నాయి, వాటా ప్రకారం తెలంగాణకు ఎందుకు చేరడం లేదన్న విషయాలను అందులో వివరించారు. తెలంగాణ ప్రాంతం ఎత్తులో ఉన్నందున లిఫ్టుల ద్వారా తరలించుకోవాల్సి వస్తోందని స్పష్టం చేశారు. ప్రత్యేకంగా రూపొందించిన త్రీడీ డిజైన్ ట్రిబ్యునల్ న్యాయమూర్తులను ఆకట్టుకుంది.