‘గోద్రా రైలు దహనం’ షూటింగ్‌..

Godhra Rail Accident Recreate For Narendra Modi Biopic - Sakshi

వడోదరా: ప్రస్తుతం దేశంలో బయోపిక్‌ల ట్రెండ్‌ నడుస్తుంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల జీవితాల ఆధారంగా సినిమాలు తెరకెక్కుతున్నాయి. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్‌ కూడా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ వడోదరాలో జరుగుతుంది. మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 2002 ఫిబ్రవరి 27న దుండగులు గోద్రా వద్ద సబర్మతి రైలులో బోగీలకు నిప్పంటించారు. ఈ ఘటనలో 59 మంది మరణించారు. వారిలో ఎక్కువ మంది కరసేవకులే ఉన్నారు. దీంతో గుజరాత్‌లో అలర్లు చెలరేగాయి. ఆ అలర్లలో దాదాపు వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో దీనికి సంబంధించి మోదీ పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ఆ గోద్రా రైలు ప్రమాద ఘటననే మోదీ బయోపిక్‌ చిత్ర బృందం తెరకెక్కిస్తుంది.

ఆదివారం రోజున వడోదరాలోని ప్రతాప్‌ నగర్‌, దోబి రైల్వే లైన్‌ మధ్యలో గోద్రా రైలు దహనం సీన్‌ను షూట్‌ చేశారు. పశ్చిమ రైల్వేస్‌, వడోదరా అగ్నిమాపక విభాగం అనుమతితో ఈ షూటింగ్‌ చేపట్టినట్టు నిర్మాణ సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. దీనిపై రైల్వే అధికారులు స్పందిస్తూ.. షూటింగ్‌ కారణంగా రైళ్ల రాకపోకలకు ఎటువంటి అంతరాయం కలగలేదని తెలిపారు. చిత్రీకరణ కోసం ఉపయోగించిన బోగి నిరూపయోగమైందని పేర్కొన్నారు.

వివేక్‌ ఒబ్‌రాయ్‌ మోదీ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని సరబ్జీత్‌, మేరికోమ్‌ బయోపిక్‌లకు దర్శకత్వం వహించిన ఓమంగ్‌ తెరకెక్కిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో ఇతర ముఖ్యపాత్రల్లో మనోజ్‌ జోషి, బొమన్‌ ఇరానీ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు విడుదల చేయనున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top