కిరాతక బస్సు డ్రైవర్‌కి ఉరి ఖరారు | gallows finalized to msrtc bus driver | Sakshi
Sakshi News home page

కిరాతక బస్సు డ్రైవర్‌కి ఉరి ఖరారు

Sep 9 2014 10:32 PM | Updated on Sep 2 2017 1:07 PM

అడ్డదిడ్డంగా బస్సు నడిపి తొమ్మిది మందిని బలి తీసుకున్న ఎమ్మెస్సార్టీసీ బస్సు డ్రైవర్ సంతోష్ మానే పెట్టుకున్న పిటిషన్‌ను మంగళవారం బాంబే హైకోర్టు తిరస్కరించింది.

 పింప్రి, న్యూస్‌లైన్: అడ్డదిడ్డంగా బస్సు నడిపి తొమ్మిది మందిని బలి తీసుకున్న ఎమ్మెస్సార్టీసీ బస్సు డ్రైవర్ సంతోష్ మానే పెట్టుకున్న  పిటిషన్‌ను మంగళవారం బాంబే హైకోర్టు తిరస్కరించింది. సెషన్స్ కోర్టు గతంలో విధించిన ఉరి శిక్షను ఖరారు చేస్తూ తీర్పు ఇచ్చింది. కాగా పుణేలో 2012 జనవరి 25న బస్టాండులో నిలిపిఉంచిన ఆర్టీసీ బస్సును  బయటికి తీసుకొచ్చిన మానే నగర వీధుల్లో అడ్డగోలుగా నడపడంతో తొమ్మిది మంది చనిపోగా, 37 మంది గాయపడిన విషయం తెలిసిందే.

ఈ ఘటనపై 2013లో విచారణ జరిపిన సెషన్స్ కోర్టు మానేకి ఉరి శిక్ష విధించింది. తాను మానసిక రోగినని పేర్కొంటూ మానే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. విచారణ సమయంలో తన వాదనను సెషన్స్ కోర్టు వినిపించుకోలేదని ఆరోపించాడు. దీనిపై పునర్‌విచారణ జరిపిన హైకోర్టు మానసిక రోగినంటూ మానే గతంలో పెట్టుకున్న పిటిషన్‌ను తిరస్కరించింది. అంతేకాకుండా ఉరి శిఖను ఖరారుచేసింది. మానేపై హత్య, హత్యాయత్నం, దాడికి పాల్పడడం, బస్సు చోరీ, ప్రజల ఆస్తులకు నష్టం చేకూర్చడం తదితర నేరాల కింద సెషన్స్ కోర్టు న్యాయమూర్తి వి.కె.శెవాలే అప్పట్లో ఉరిశిక్ష విధించిన సంగతి విదితమే.

Advertisement
 
Advertisement
Advertisement