ఢిల్లీ అల్లర్లపై నకిలీ ఫొటోలు వైరల్‌! | Fake Viral Photos On Delhi violence | Sakshi
Sakshi News home page

ఢిల్లీ అల్లర్లపై నకిలీ ఫొటోలు వైరల్‌!

Mar 2 2020 5:11 PM | Updated on Mar 2 2020 8:09 PM

Fake Viral Photos On Delhi violence - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఓ యువతి భుజాన కత్తితో చీరిన రెండు గాయాలు, వాటి నుంచి రక్తం కారుతున్న దృశ్యం. మరో పక్క రక్తం మడుగులో ఇద్దరు మహిళలు. ‘ఇవి ఢిల్లీ అల్లర్ల సందర్భంగా ముస్లింలు హిందువుల ఇళ్లలో జొరబడి తల్లులు, చెల్లెళ్లపై జరిపిన దాడి దశ్యాలు. ఇవి ఇస్లాం ఛాందసవాదానికి సిగ్గు చేటు’ అనే వ్యాఖ్యానంతో నాలుగు ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మంజూ సింగ్‌ అనే ఫేస్‌బుక్‌ యూజర్‌ వీటిని ముందుగా పోస్ట్‌ చేయగా, ఇతరులు వాటిని షేర్‌ చేస్తున్నారు. (కుదుటపడుతున్న ఢిల్లీ)

యువతిపై రెండు కత్తి గాయాలున్నా మొదటి, రెండు ఫొటోలు 2018, అక్టోబర్‌లో మొదటిసారి సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. నాడు కూడా బీహార్‌లోని ఓ హిందూ యువతిపై ముస్లిం మూక దాడి చేసిన దృశ్యాలంటూ మొదటి రెండు ఫొటోలను మొదటిసారి పోస్ట్‌ చేశారు. వాస్తవానికి లైంగిక సంబంధానికి అంగీకరించకపోవడంతో ఆ యువతిపై సందీప్‌ గిరీ అనే యువకుడు కత్తితో దాడి జరిపిన దశ్యాలు. బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లోని కటేయ ప్రాంతంలో ఆ యువతిపై సందీప్‌ గిరీ ఈ దాడి చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన గోపాల్‌ గంజ్‌ పోలీసులు సందీప్‌ గిరీని అరెస్ట్‌ చేశారు. (ఢిల్లీ అల్లర్లు: అంతర్జాతీయ మీడియా ఫైర్)

ఇక రక్తం మడుగులో పడి ఉన్న ఇద్దరు మహిళలకు సంబంధించిన మూడు, నాలుగు ఫొటోలు కూడా ఢిల్లీ అల్లర్లకు సంబంధించినవి కావు, అవి కూడా చాలా పాతవి. అందులో మూడవ ఫొటో 2018లో యూట్యూబ్‌లో పోస్ట్‌ అయిన ఓ వీడియోలోనిది కాగా, నాలుగవ ఫొటో 2015లో ఓ బ్లాగ్‌లో వచ్చిన ఫొటో. ఇలాంటి నకిలీ ఫొటోలు, వార్తలను ఎప్పటికప్పుడు పట్టుకునే ‘ఆల్ట్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌’ వెబ్‌సైట్‌ శోధించగా ఈ వివరాలు మాత్రమే వెలుగులోకి వచ్చాయి. ఆ మహిళల హత్యకు సంబంధించిన వివరాలు దొరకలేదు. ఢిల్లీ అల్లర్లకు సంబంధించిందంటూ ఏవో ఫేక్‌ ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోన్న విషయం తెల్సిందే. (పేరు అడిగి.. కొట్టి చంపారు.. కిందకు దూకేశాం..)

Advertisement
 
Advertisement
Advertisement