తిరుచందూర్లో మత్తు ఇంజెక్షన్లను విక్రయించే ముఠాను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.
కేకేనగర్ (చెన్నై) : తిరుచందూర్లో మత్తు ఇంజెక్షన్లను విక్రయించే ముఠాకు చెందిన ముగ్గురిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఒక ఇంజెక్షన్కు రూ. 200లు వసూలుచేస్తున్నట్లు పోలీసుల విచారణలో తెలిసింది. తూత్తుకుడి జిల్లా తిరుచందూర్ వీరరాఘవరపురం వీధిలో డబ్బుల కోసం ఒక ముఠా మత్తు ఇంజెక్షన్లు వేస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో తిరుచందూర్ ఆలయ పోలీసులు వీరరాఘవపురంలో ఆకస్మిక తనిఖీలు చేశారు.
అదే ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ ఇస్కిముత్తు (36) ఇంట్లో అధిక సంఖ్యలో ఇంజెక్షన్లు, మత్తు మందులు గల సిరంజలు, మత్తు మందు బాటిళ్లు, 3 ఖాళీ బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో ఇస్కిముత్తు గత కొన్ని రోజులుగా తన ఇంట్లో అనేక మందికి మత్తు ఇంజెక్షన్లు వేస్తున్నట్లు తెలిపింది. అతనికి సహాయపడిన తిరుచందూర్ వీరకాళి అమ్మన్ కోవిల్ వీధికి చెందిన మణికంఠన్ (22), సెల్వం (36)లను అరెస్టు చేశారు. నిందితులను తిరుచందూర్ కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.