భార్యకు కడుపు నొప్పి .. కిడ్నీ కొట్టేసిన భర్త  | Sakshi
Sakshi News home page

భార్యకు కడుపు నొప్పి .. కిడ్నీ కొట్టేసిన భర్త 

Published Thu, Feb 8 2018 1:37 PM

dowry : Bengal man solds wifes kidney  - Sakshi

కోల్‌కతా : అడిగినంత క‌ట్నం ఇవ్వలేదని భార్య కిడ్నీనే దొంగిలించాడు కోల్‌క‌తాకు చెందిన ఓ వ్యక్తి. రెండేళ్ల కిందట జరిగిన ఈ సంఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. రీటా సర్కార్ (28), బిస్వజిత్‌లకు 12 ఏళ్ల కిందట వివాహం జరిగింది. రీటా తల్లిదండ్రులు రూ. 2 లక్షల కట్నం డబ్బు ఇవ్వలేదని అత్తింటివారు తరచూ వేధించేవారు. రెండేళ్ల కిందట రీటాకు కడుపునొప్పి రావడంతో బిస్వజిత్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడే కడుపు నొప్పికి అపండిసైటిస్ ఆప‌రేష‌న్ అని చెప్పి కిడ్నీ అమ్ముకుని క‌ట్నం డ‌బ్బుల కింద జ‌మ చేసుకున్నాడు.

'అపండిసైటిస్ ఆప‌రేష‌న్ తర్వాత నొప్పి తీవ్రత మరింత పెరిగింది. సర్జరీకి సంబంధించిన విషయాన్ని ఎవరితోనూ చెప్పొదని నా భర్త తరచూ హెచ్చరించేవాడు. నొప్పి భరించలేకపోతున్నానని మరోసారి ఆసుపత్రికి తీసుకెళ్లమని ఎంత ప్రాధేయపడినా ఒప్పుకునే వాడు కాదు' అని  రీటా పేర్కొన్నారు. నొప్పి తీవ్రత ఎక్కువ కావడంతో రీటాని బంధువులు నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు. కిడ్నీ ఒకటి మిస్సయిందని డాక్టర్లు చెప్పడంతో రీటా షాక్‌కు గురైంది. కట్టుకున్న భర్తే మోసం చేశాడని తెలియడంతో తట్టుకోలేకపోయింది. ఈ ఘటనపై ఫరక్కా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

రీటా భర్త బిస్వజిత్‌తోపాటూ అతని సోదరుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. రీటాకి సర్జరీ చేసిన ఆసుపత్రిపై కూడా పోలీసులు దాడులు నిర్వహించారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తకు కిడ్నీ అమ్మేసినట్టు బిస్వజిత్‌ నేరాన్ని ఒప్పుకున్నాడు. ఈ నేరం వెనక కిడ్నీలను స్మగ్లింగ్ చేసే గ్యాంగ్ హస్తం ఉందనే కోణంలో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ కొనసాగిస్తోంది.

బాధితురాలు రీటా సర్కార్

Advertisement
Advertisement