
హిండోన్(యూపీ): యుద్ధానికి సన్నద్ధం కావాలంటూ ఆదేశాలు అందిన అతి తక్కువ వ్యవధిలోనే సమరానికి తాము సిద్ధంగా ఉంటామని వాయుసేన అధిపతి ఎయిర్చీఫ్ మార్షల్ బీరేంద్ర సింగ్ ధనోవా ఆదివారం వెల్లడించారు. వాయుసేన 85వ వార్షికోత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని హిండోన్లో ఉన్న వైమానిక స్థావరాన్ని ఆయన ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్తో కలసి సందర్శించారు. దేశానికి భద్రత పరంగా ఎదురయ్యే ఏ సవాల్నైనా ఎదుర్కొని దీటుగా సమాధానమిచ్చేందుకు వాయుసేన సంసిద్ధంగా ఉందన్నారు.
ప్రస్తుతం నెలకొన్న భౌగోళిక–రాజకీయ వాతావరణం చూస్తోంటే స్వల్పకాలిక యుద్ధం రావొచ్చని తనకు అనిపిస్తోందని ధనోవా వ్యాఖ్యానించారు. ఇటీవలి కాలంలో డోక్లాంలో చైనా దుందుడుకుగా వ్యవహరించడం, జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలు రోజురోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ధనోవా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్లో శుక్రవారం వాయుసేనకు చెందిన ఎంఐ–17 హెలికాప్టర్ కూలిపోయి ఏడుగురు సిబ్బంది మరణించడం తెలిసిందే. ఈ ప్రమాదానికి హెలికాప్టర్ వెనుకభాగంలో ఉండే ఫ్యాన్ తొలగిపోవడమే కారణమని భావిస్తున్నట్లు ధనోవా వెల్లడించారు. హెలికాప్టర్ ఇంజిన్ బాగా పనిచేస్తోందనీ, వెనుక ఫ్యాన్ హెలికాప్టర్ నుంచి విడిపోయిందని ఆయన పేర్కొన్నారు.