రూ. 20 సంపాదిస్తున్న డేరా బాబా

రోహ్తక్, హర్యానా : డేరా సచ్ఛా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్కు రోహ్తక్ జైల్లో 0.2 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఈ స్థలంలో డేరా బాబా కూరగాయలు పండిస్తూ రోజుకు 20 రూపాయల వరకూ సంపాదిస్తున్నారు. జైల్లోకి వెళ్లిన నాటి నుంచి ఇప్పటివరకూ గుర్మీత్ ఒకటిన్నర క్వింటాళ్ల బంగాళదుంపలు పండించారు.
అంతేకాకుండా తనకు కేటాయించిన స్థలంలో డేరా బాబా అలోవేరా, టమోటాలు, సొర కాయలు, బీర కాయలు కూడా పండిస్తున్నట్లు పేరు తెలుపడానికి ఇష్టపడని జైలు అధికారి ఒకరు వెల్లడించారు. రోజుకు రెండు గంటల పాటు వ్యవసాయ క్షేత్రంలో డేరా బాబా శ్రమిస్తున్నారని వివరించారు. డేరా బాబా పండించిన కూరగాయలను జైలులో వంటకు వినియోగిస్తున్నట్లు తెలిపారు.
కూరగాయల ద్వారా సంపాదించిన సొమ్ము గుర్మీత్ చేతికి అందడం లేదని చెప్పారు. జైలులో ఉన్న వారి శ్రమకు వచ్చే ధనాన్ని ఆన్లైన్ ద్వారా అకౌంట్లలో వేస్తారని తెలిపారు. హర్యానా హైకోర్టు గుర్మీత్ బ్యాంకు అకౌంట్లను సీజ్ చేయాలని ఆదేశించడంతో సంపాదించిన సొమ్ము సైతం డేరా బాబాకు అందడం లేదని చెప్పారు.
జైలులోని వారికి అధ్యాత్మిక బోధనలు చేసేందుకు అనుమతించాలని కూడా డేరా బాబా ప్రభుత్వానికి వినతి పెట్టుకున్నారని వెల్లడించారు. అయితే, ప్రభుత్వం ఇందుకు అనుమతి ఇవ్వలేదని తెలిపారు. కాగా, 20 సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా బాబాను రోహ్తక్ జైల్లోని ప్రత్యేక బారాక్లో ఉంచుతున్న విషయం తెలిసిందే. జైలుకి వెళ్లిన నాటి నుంచి డేరా బాబా ఆరు కిలోల బరువు తగ్గారు. వ్యవసాయ క్షేత్రంలో చెమటోడ్చుతుండటంతో ఆయన ఆరోగ్యం కూడా బాగా మెరుగుపడినట్లు తెలుస్తోంది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి