
‘ఉపద్రవీ’ కేజ్రీవాల్
బీజేపీ తాజాగా జారీ చేసిన ప్రకటనలో గోత్రం పేరుతో తనపై దాడిచేయడం పట్ల ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కే జ్రీవాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
- ఢిల్లీ ఎన్నికల్లో హోరెత్తుతున్న పోస్టర్ వార్
- కేజ్రీవాల్ గోత్రాన్ని ప్రస్తావిస్తూ బీజేపీ పోస్టర్
- ఈసీకి ఫిర్యాదు చేసిన ఆప్
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ తాజాగా జారీ చేసిన ప్రకటనలో గోత్రం పేరుతో తనపై దాడిచేయడం పట్ల ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కే జ్రీవాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆప్ బీజేపీపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదుచేసింది. కొద్ది రోజులుగా బీజేపీ తనపైనా, తన పిల్లలపైనా, అన్నా హజారే పైనా వ్యక్తిగత దాడులు చేస్తూ పత్రికల్లో ప్రకటనలు చేయటంపై కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు.
వ్యక్తిగత ఆరోపణలను భరించే సహనం ఉండాలని అన్నా చెప్పటం వల్ల తొలి ప్రకటనపై తాను స్పందించలేదని, అయితే బీజేపీ తాజా ప్రకటనలో అన్ని హద్దులను అతిక్రమించటంతో మాట్లాడక తప్పలేదని కేజ్రీవాల్ అన్నారు. సోమవారం ఉదయం బీజేపీ పత్రికల్లో ఇచ్చిన కార్టూన్ ప్రకటనలో కేజ్రీవాల్పై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించింది. ‘‘గణతంత్ర దినోత్సవాన్ని దేశ ప్రజలు జాతీయ పర్వదినంగా భావిస్తారు. అలాంటి పర్వదినానికి ఆటంకం కలిగించేందుకు ‘ఉపద్రవీ’ గోత్రం ఉన్న వ్యక్తి నిరుడు సిద్ధమయ్యారు. అందువల్లే ఈ ఏడాది ఆయనకు ఆహ్వానం అందలేదు.’’ అంటూ ఆరోపణలు చేసింది.
ఈ ఆరోపణలను కేజ్రీవాల్ తీవ్రంగా ఖండించారు. తన గోత్రీకులైన అగర్వాల్ కులస్థులందరినీ బీజేపీ కించపరిచిందని ఆయన అన్నారు. తనతో పోరాడాలనుకుంటే బిజెపి తనపై ఆరోపణలు చేయాలే కానీ మొత్తం అగర్వాల్ కులంపై దాడిచేయడం సమంజసం కాదని కేజ్రీవాల్ ఆరోపించారు. కుల రాజకీయాలతో బీజేపీ పూర్తిగా దిగజారిందని ఆయన అన్నారు. ఢిల్లీ ప్రజలు ఇలాంటి నిందారాజకీయాలను ఆమోదించరనీ అన్నారు. బీజేపీ వాణిజ్యప్రకటనను వెంటనే ఉపసంహరించుకోవాలని, బహిరంగ క్షమాపణ చెప్పాలని లేనట్లయితే తాము రంగంలోకి దిగుతామని ఆప్ నేత ఆశుతోష్ చెప్పారు.
ఈ వ్యవహారంపై ఆప్, బీజేపీలు రెండూ కూడా ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసుకున్నాయి. కేజ్రీవాల్ ఆరోపణలపై బీజేపీ స్పందించింది. కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి పియూష్ గోయల్ ఈ అడ్వర్టయిజ్మెంట్లో గోత్రం ప్రస్తావన ఉపమానం మాత్రమేనని చెప్పారు. ఆప్ డీఎన్ఏ, అరాచ కతతో కూడిన దాని రాజకీయ సిద్ధాంతాల గురించి చెప్పడం కోసమే ఈ ఉపమానాన్ని ఉపయోగించినట్లు ఆయన చెప్పారు. తాము ఎన్నడూ సమాజాన్ని కులాల పేరిట విడదీయబోమని ఆయన చెప్పారు.