న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మహిళా వ్యతిరేకి అని, ఆయన గూండా రాజకీయాలకు పేరుగాంచిన వ్యక్తి అని రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్ అన్నారు. 2012 నుంచి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్న ఆమె.. శుక్రవారం (ఏప్రిల్ 24) బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.
బీజేపీలో చేరిన తర్వాత తొలిసారి స్వాతి మాలివాల్ శనివారం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. “నేను బీజేపీలో ఏ ఒత్తిడి లేకుండా చేరాను. మోదీ నాయకత్వంపై నమ్మకం ఉంది. సానుకూల రాజకీయాలు చేయాలనుకునే వారు బీజేపీలో చేరాలని కోరుతున్నాను. 2006 నుంచి కేజ్రీవాల్తో కలిసి పనిచేశాను, పలు ఉద్యమాల్లో మద్దతు ఇచ్చాను. అయితే, తర్వాత పార్టీలో నాపై హింస, ఒత్తిడి పెరిగింది. రెండు సంవత్సరాలు పార్లమెంట్లో మాట్లాడే అవకాశం ఇవ్వలేదు.
నా ఇంట్లోనే ఒక గుండా ద్వారా నాపై దాడి చేయించారు. దీనిపై నేను నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను వెనక్కి తీసుకోవాలని బెదిరించారు, తీవ్రమైన ఒత్తిడి చేశారు. రెండు సంవత్సరాలు పార్లమెంట్లో మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. ఇది చాలా సిగ్గుచేటు. నేను ఆప్ను వదిలి బీజేపీలో చేరాను’’ అని ఆమె అన్నారు.
పంజాబ్లో ఆప్ పాలనపై మాట్లాడుతూ.. పంజాబ్ను ఆప్ నేతలు వ్యక్తిగత ఏటీఎంగా మార్చారని ఆరోపించారు. “ఇసుక తవ్వకం, మాదక ద్రవ్యాల వినియోగం అత్యధిక స్థాయిలో ఉన్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే నాయకులపై ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారు. కేజ్రీవాల్ అవినీతి, గూండాగిరికి పేరుగాంచిన వ్యక్తి. మోదీ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణగల నాయకుడు.
ఆపరేషన్ సిందూర్, నక్సలిజం ముగింపు, పార్లమెంట్లో మహిళల రిజర్వేషన్ బిల్లు వంటి సమయాల్లో మోదీ, అమిత్ షా చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. నేను బీజేపీలో ఏ ఒత్తిడి లేకుండా చేరాను, మోదీ నాయకత్వంపై నమ్మకం ఉంది” అని ఆమె చెప్పారు.
మరోవైపు, శుక్రవారం బీజేపీలో చేరిన తర్వాత, స్వాతి మాలివాల్.. ఆప్ జాతీయ కన్వీనర్ ఆర్వింద్ కేజ్రీవాల్పై విమర్శలు చేస్తూ.. ఆప్లో నిజాయితీతో కూడిన రాజకీయాల సిద్ధాంతాలు, విలువలను వదిలేశారని అన్నారు.
ఆర్టీఐ ఉద్యమం, అన్నా ఉద్యమం, ఆప్ స్థాపన, ఢిల్లీ మహిళా కమిషన్లో పనిచేసిన తీరును ప్రస్తావించారు. “2006లో నేను ఉద్యోగం వదిలి దేశ సేవ మార్గాన్ని ఎంచుకున్నాను. ఆర్టీఐ ఉద్యమం, అన్నా ఉద్యమం, ఆప్ స్థాపన, ఢిల్లీ మహిళా కమిషన్లో 8 సంవత్సరాల సేవ.. ఇలా ప్రతి దశలో నిజాయితీతో పనిచేశాను” అని ఆమె చెప్పారు.


