
‘కంపెనీల’ నుంచి ఆప్కు 2 కోట్లు
నకిలీ కంపెనీల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) రూ. 2 కోట్లను వసూలు చేసిందని ఆప్ నుంచి విడిపోయిన ఆప్ వాలంటీర్ యాక్షన్ మంచ్(అవామ్) ఆరోపించింది.
- నకిలీ కంపెనీల నుంచి వసూలు చేశారని ఆప్ మాజీ అనుబంధ సంస్థ ‘అవామ్’ ఆరోపణ
- 31 కంపెనీల నుంచి మిడ్నైట్ హవాలా నడిపించారంటూ బీజేపీ ఆరోపణ
- ఖండించిన ఆప్.. సిట్తో దర్యాప్తు చేయించాలని డిమాండ్
- తప్పు చేస్తే శిక్షించాలన్న కేజ్రీవాల్
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల కోసం గత సంవత్సరం నాలుగు నకిలీ కంపెనీల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) రూ. 2 కోట్లను వసూలు చేసిందని ఆప్ నుంచి విడిపోయిన ఆప్ వాలంటీర్ యాక్షన్ మంచ్(అవామ్) ఆరోపించింది. హేమప్రకాశ్ అనే వ్యక్తి నుంచి నాలుగు వేర్వేరు కంపెనీల ద్వారా రూ. 50 లక్షల చొప్పున నాలుగు దఫాలుగా మొత్తం రెండు కోట్ల రూపాయలు 2014 ఏప్రిల్లో ఆప్ బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయని అవామ్ ప్రతినిధి గోపాల్ గోయల్ సోమవారం విలేకరుల సమావేశంలో ఆరోపణలు చేశారు.
ఈ నాలుగు కంపెనీల రిజిస్ట్రేషన్ చిరునామాలు గోకుల్పురి, పాలం కాలనీ, రాంలీలా పార్కు, కర్వాల్నగర్లోని జుగ్గీ జోపిడీల్లో ఉన్నాయని తెలిపారు. ఈ నాలుగు రిజిస్ట్రేషన్లు కూడా గత ఏడాది ఏప్రిల్ నెలలోనే చేసినట్టు ఉందన్నారు. కంపెనీ కార్యకలాపాలు, డెరైక్టర్లు ఎవరనేది వివరాలు లేవన్నారు. కంపెనీ రిజిస్ట్రేషన్లో ప్రస్తావించిన చిరునామాలైన కరావల్ నగర్, పాలం కాలనీ, గోకుల్ పురి, రామ్లీలాపార్క్లకు వెళ్లి ఆరా తీయగా జుగ్గీ జోపిడీలు ఉన్నాయనీ. ఈ ప్రాంతాలలో కంపెనీలకు సంబంధించిన ఎలాంటి సమాచారం లభించలేదన్నారు.
గత లోక్సభ ఎన్నికల్లో టికెట్లు విక్రయించి అక్రమంగా సొమ్ముచేసుకుందని కూడా గోపాల్ ఆప్పై ఆరోపణలు చేశారు. నాలుగు కంపెనీలకు హేమ ప్రకాశ్ ఒకరే డెరైక్టర్ అనీ, ఇవి ఎలాంటి వ్యాపారాలు చేయటం లేదని, దీనిపై సీబీఐ లేదా, ఈడీ లేదా ఇతర దర్యాప్తు సంస్థలతో కేంద్రం దర్యాప్తు చేయించాలని అవామ్ డిమాండ్ చేసింది. మొత్తం 31 బోగస్ కంపెనీలను సృష్టించి నల్లధనాన్ని చందాల రూపంలో తీసుకుందని గోపాల్ అన్నారు.
ఇదో పెద్ద కుట్ర: కేజ్రీవాల్
తనకు వ్యతిరేకంగా పెద్ద కుట్ర జరుగుతోందని ఆప్ అధినేత, సీఎం అభ్యర్ధి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. బినామీ కంపెనీల నుంచి అక్రమంగా చందాలు తీసుకున్న వివాదంపై ఆయన స్పందించారు. ‘ఎన్నికలకు ముందే బీజేపీ ఓడిపోయింది. నాపై, ఆప్కు వ్యతిరేకంగా పెద్ద కుట్ర పన్నుతున్నారు. ఎన్నికలు ఢిల్లీ ప్రజలకు పరీక్ష పెడుతున్నాయి. నిజాయితీ, వాస్తవాలకు మద్దతు ఇస్తారని నమ్ముతున్నాను’ అని పేర్కొన్నారు. ఆప్ నేత యోగేంద్ర యాదవ్ మాట్లాడుతూ స్వచ్ఛంద సేవా సంస్థ అవామ్ చేసిన ఆరోపణలను నిరాధారమైనవిగా ఖండించారు.
గతంలోనూ ఇలాంటి ఆరోపణలే చేశారని, విచారణ కూడా జరిగిందన్నారు. కాంగ్రెస్, బీజేపీలు అక్రమ మార్గాల్లో విరాళాలు తీసుకుంటున్నాయని, ఆప్ విరాళాల సేకరణలో పూర్తి పారదర్శకత ఉంటుందని చెప్పారు. తాము తీసుకుంటున్న చందాల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదన్నారు. ఈ ఆరోపణలపై దర్యాప్తునకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఆరోపణలపై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని ఆప్ నేత యోగేంద్ర యాదవ్ డిమాండ్ చేశారు. తప్పు చేసినట్లు తేలితే ఎలాంటి శిక్షకైనా సిద్ధంగా ఉన్నామన్నారు.
విచారణ జరిపించాలి: బీజేపీ డిమాండ్
ఆమ్ఆద్మీ పార్టీ బినామీ కంపెనీల నుంచి సేకరించిన విరాళాలపై విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఆప్ అక్రమ చందాల వసూళ్లు మిడ్నైట్ హవాలా వంటివని ఇటీవల ఆప్ నుంచి బీజేపీలో చేరిన షాజియా ఇల్మీ అన్నారు. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్, బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావులు వేర్వేరుగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆప్ తీరుపై ధ్వజమెత్తారు. బోగస్ కంపెనీల నుంచి విరాళాల రూపంలో నల్లధనాన్ని తీసుకుని వాటిని తెల్లధనంగా చలామణి చేస్తోందని ఆరోపించారు. అక్రమ చందాల దందాపై దేశ ప్రజలకు వివరణ ఇచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.