చదివిన స్కూల్లోనే సీబీఎస్ఈ పరీక్షలు
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ 10, 12వ తరగతుల పెండింగ్ పరీక్షల విషయంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. విద్యార్థులు బయటి కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, తాము ప్రస్తుతం చదువుకుంటున్న స్కూల్లోనే ఈ పరీక్షలు రాయొచ్చని సూచించింది. లాక్డౌన్ కంటే ముందు నిర్వహించిన పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఇప్పటికే మొదలైంది. బోర్డు పరీక్షల ఫలితాలను జూలై మాసాంతం నాటికి వెళ్లడించేలా మానవ వనరుల అభివృద్ధి శాఖ ప్రణాళిక రూపొందిస్తోంది. సీబీఎస్ఈ 10, 12వ తరగతుల పరీక్షల నిర్వహణకు లాక్డౌన్ నిబంధనల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు.